ఆర్ఆర్ఆర్: 50 రోజుల యాక్షన్ సీక్వెన్స్ పూర్తి.. నెక్ట్స్ షెడ్యూల్ పూణేలో...
on Nov 30, 2020
జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సుదీర్ఘమైన 50 రోజుల షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. లాక్డౌన్ తర్వాత అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ను పునరుద్ధరించారు. అప్పట్నుంచీ చిత్ర బృందం ఈ చిత్రానికి సంబంధించిన బిహైండ్ ద సీన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్కు ఉత్సాహాన్నిస్తూ వస్తోంది.
ఇటీవల రాత్రిపూట చలిలోనూ వారు షూటింగ్ చేశారు. ఇందుకోసం సెట్లో వేడి వేడి పానీయాలు, హీటర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంచారు. తాజాగా, ఒక పెద్ద యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయ్యిందని తెలియజేస్తూ ఒక బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) ఫుటేజ్ను షేర్ చేశారు 'ఆర్ఆర్ఆర్' మూవీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నిర్వాహకులు. దాంతో పాటు "గుడ్బై వింటర్ నైట్స్!!! దాదాపు 50 రోజులు నైట్ షూట్లో చేసిన ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ను పూర్తి చేశాం. ఇప్పుడు.. కొన్ని అందమైన లొకేషన్లను కొత్త షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాం. #RRRMovie.” అంటూ రాసుకొచ్చారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పూణేలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలవనున్నది. ఆ తర్వాత వేరే లొకేషన్లకు వెళ్లనున్నారు. ఇప్పుడు జరిగిన షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్పై యాక్షన్ సీన్లు తీశారు. మధ్యలో నాలుగు రోజుల విరామం లభించడంతో ఫ్యామిలీతో కలిసి దుబాయ్లో విహార యాత్ర చేసి వచ్చిన ఆయన, వచ్చీ రావడంతోటే నైట్ షూట్లో యాక్షన్ సీన్స్ చేశాడు. ఈ మూవీలో ఆయన కొమరం భీమ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్ నటిస్తున్నాడు. ఆ ఇద్దరి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్స్కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ లభించింది. అయితే టీజర్లో భీమ్ను ముస్లిం క్యాప్తో చూపించడం వివాదానికి దారి తీసింది.
'ఆర్ఆర్ఆర్'తో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ టాలీవుడ్కు పరిచయమవుతుండగా, మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఓలీవియా మోరిస్, శ్రియా శరన్, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, సముద్రకని ఇతర ప్రధాన పాత్రధారులు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానున్నది.
Also Read