మధ్యలో మహర్షి, రూలర్ మాత్రమే చేశాడట!
on Dec 3, 2019
హాస్య నటుడు శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తుగా'. ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా చేసే క్రమంలో... హాస్య నటుడిగా పలు అవకాశాలు వచ్చినప్పటికీ చేయలేక పోయానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సినిమా చేసేటప్పుడు... మధ్యలో 'మహర్షి', 'రూలర్' చిత్రాలు మాత్రమే చేశానని ఆయన అన్నారు. కమెడియన్స్ అందరూ తనకు చాలా హెల్ప్ చేశారని చెప్పారు. ఎవరూ డబ్బులు తీసుకోలేదట. 'సినిమా విడుదల తర్వాత తీసుకుంటాం. టెన్షన్ పడవద్దు' అని శ్రీనివాస రెడ్డికి ధైర్యం చెప్పారట.
సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ "నాకు ఎప్పటినుండో ఎంటర్టైన్మెంట్ బేస్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉంది. ఒక చిన్న కాన్సెప్ట్ అనుకున్నాం. మా కమెడియన్స్ అందరికీ ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అది పెట్టి ఒక ఏడాది అయిన సందర్భంగా అదే పేరుతో బ్యానర్ రిజిస్టర్ చేశాను. మా అందరి క్యారెక్టర్స్ ఉండేలా స్క్రిప్ట్ డిజైన్ చేశాం. కథ బాగా వచ్చింది. కథను, మమ్మల్ని కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయడం కష్టమేమో అని నేనే డైరెక్షన్ చేశా. నాకు ఎప్పటినుండో డైరెక్షన్ చేయాలనేది ఒక డ్రీమ్. అది ఈ సినిమాతో నెరవేరింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. కథంతా ఒక్క రోజులో జరుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతి టాపిక్ ను ఏదో ఒక క్యారెక్టర్ కి కనెక్ట్ చేశాను. ఈ సినిమా స్టార్ట్ చేయడం వల్ల చాలా సినిమాలు చేయలేకపోయాను. అవకాశాలు వచ్చిన వదులుకున్నాను. మధ్యలో 'మహర్షి' మాత్రమే చేశా.
దిల్ రాజు గారి నిర్మాణ సంస్థ, మహేష్ బాబు గారి సినిమా నుంచి వచ్చిన అవకాశం కావడంతో కాదనలేకపోయాను. నా సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారి 'రూలర్' చేసే అవకాశం వచ్చింది. దాంతో నా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పక్కనపెట్టి మరి ఆ సినిమా చేశా" అని అన్నారు. గీతాంజలి, ఆనందోబ్రహ్మ సినిమాలు విజయం సాధించడంతో... హీరో గా నటించమని చాలామంది హారర్ కథల తో తన దగ్గరకు వస్తున్నారని, వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నానని శ్రీనివాస రెడ్డి అన్నారు.