ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమం అని ప్రకటించిన హాస్పిటల్ బులెటిన్
on Sep 24, 2020
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యపరిస్థితి మరోసారి విషమించింది. గత నెల 5వ తేదీన కరోనాతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుండి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని తనయుడు ఎస్ పి చరణ్ పేర్కొన్నారు. అయితే... ప్రస్తుతం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి.
"ఆగస్టు 5న కరోనాతో మా ఆసుపత్రిలో ఎస్పీబీ చేరారు. అప్పటినుండి ఎక్మో, వెంటిలేటర్ సహకారంతో ఆయనకు చికిత్స అందిస్తున్నాం. గడచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. ఆస్పత్రిలోనే అనుభవజ్ఞులు చాలా దగ్గరగా ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు" అని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నాయి.
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అభిమానులు సహా సినిమా ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు.