షావుకారు జానకి, మొగులయ్యకు పద్మశ్రీ పురస్కారం!
on Jan 25, 2022
కేంద్రం ప్రభుత్వం నేడు ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు చిత్రరంగానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఒకరు ఏడు దశాబ్దాలకు పైగా సినిమాల్లో నటిస్తూ, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అలనాటి మేటి నటీమణుల్లో ఒకరైన షావుకారు జానకి కాగా, మరొకరు అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్యకారునిగా పేరుపొంది, ఇటీవలే 'భీమ్లా నాయక్'లో పాట పాడటం ద్వారా పాపులారిటీ దక్కించుకున్న దర్శనం మొగులయ్య.
Also read: వివాదంలో సింగర్ సునీత భర్త!
షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి వయసు 90 సంవత్సరాలు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 385 కి పైగా సినిమాల్లో నటించారు. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలున్నాయి. నందమూరి తారకరామారావు సరసన నటించిన తొలిచిత్రం 'షావుకారు' (1950) ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. ఆ తర్వాత అనేక మంచి పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. జానకి 1931 సంవత్సరం డిసెంబరు 12న రాజమండ్రిలో జన్మించారు. అక్కడే పెరిగారు. అయితే సినిమాల్లో నటిస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. తమిళనాడు రాష్ట్రం నుంచి ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
Also read: ఓటీటీలోనూ 'అఖండ' జాతర
దర్శనం మొగులయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. మొగులయ్య నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నారు. మొగులయ్య తొలిసారిగా 'భీమ్లా నాయక్' సినిమాలో "సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు" అనే పాట ద్వారా సినీరంగంలోకి వచ్చి, ఆ పాటతో మంచి గుర్తింపు అందుకున్నారు.