సౌందర్యకు ప్రేరణ వారిద్దరేనట!
on Jul 18, 2018
సౌందర్య... దక్షిణాది వెండితెరను పిల్లతెమ్మరలా పలకరించి... ప్రేక్షకులకు తన అభినయంతో ఆనందాన్ని పంచి అంతలోనే అంతర్థానమైన అద్భుతనటి.
ముఖానికి రంగేసుకున్నంత మాత్రాన అందరూ నటులు కాలేరు. ఆ మాటకొస్తే.. ఇప్పుడున్న హీరోయిన్లలో దాదాపుగా అందరూ గ్లామర్ తారలే. 'నటి' అనిపించుకునేంత స్థాయి వీళ్లలో ఎవరికుంది చెప్పండి.? కాస్తోకూస్తో.. సమంత, అనుష్క సాయిపల్లవి, నిత్యామీనన్.. వీళ్ల పేర్లు చెప్పొచ్చు. కానీ వీళ్ల స్థాయి కూడా కొంత వరకే. ఎందుకంటే.. వారికి దొరికిన పాత్రలు అలాంటివి. అద్భుతమైన పాత్రలు దొరికినప్పుడు కాదా.. నటుల ప్రతిభ బయటపడేది.
సౌందర్యకు అలాంటి పాత్రలు పడ్డాయ్. మనవరాలిపెళ్లి, రాజేంద్రుడు -గజేంద్రుడు, మాయలోడు, టాప్ హీరో ఇంకా కొన్ని ఉన్నాయ్. ఈ సినిమాలు చూస్తే అల్లరి పిల్ల కనిపిస్తుంది. హలో బ్రదర్, దొంగాట ఈ తరహా సినిమాల్లో అన్యంపుణ్యం తెలీని అందమైన అమాయకురాలు కనిపిస్తుంది. 'పెదరాయుడు'లో అయితే... గారాల కూతురు, పొగరబోతు కోడలు.. టూ షేడ్స్. 'పవిత్రబంధం' చూస్తే.. ఆత్మాభిమానం గల ఓ భార్య కనిపిస్తుంది. 'ఇంట్లో ఇలాలూ-వంటింటో ప్రియురాలు' చూస్తే.. అమ్మను మరపించే అమాయక ఇల్లాలు కనిపిస్తుంది. 'పెళ్లి చేసుకుందాం' చూస్తే.. బాధ్యతగల స్త్రీమూర్తి, ఓ విధి వంచిత కనిపిస్తుంది. '9 నెలలు' చూస్తే.. భర్తను ప్రాణాధికంగా ప్రేమించే భార్య కనిపిస్తుంది. 'అన్నయ్య' చూస్తే స్వశక్తితో ఎదిగిన మహిళ కనిపిస్తంది. 'రాజు'లో అయితే.. ఓ మంచి అమ్మాయి కనిపిస్తుంది. ఇన్ని విభిన్నమైన పాత్రలు దొరికాయ్ సౌందర్యకు. వాటన్నింటికీ న్యాయం చేసి 'అద్భుత నటి' అనిపించుకుంది సౌందర్య.
నటిగా సౌందర్యను పరిశీలిస్తే.. ఆమెలో ఇద్దరు మహానటీమణులు కనిపిస్తారు. దీన్ని ఇమిటేషన్ అంటానికి లేదండోయ్. బహుశా తను వారిద్దరినీ ఆదర్శంగా తీసుకొని ఉండొచ్చు. కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ విషయం తనే చెప్పింది కూడా. ఇంతకీ వారిద్దరెవరో చెప్పనేలేదుకదూ.. ఇంకెవరూ.. సావిత్రి, శ్రీదేవి. కట్టుబొట్టులో సౌందర్య.. పూర్తిగా సావిత్రినే అనుసరించిందని చెప్పకతప్పదు. పైగా సావిత్రిలా నిండైన విగ్రహం కదా.. అందుకే చీరలో సౌందర్య పేరుకు దగ్గట్టుగానే ఉండేది. ఆ కొంగును నడుము చుట్టూ నిండుగా కప్పుకొని నడిచే తీరు నిజంగా సావిత్రమ్మనే గుర్తు చేసేది. అందుకే.. అందరూ సౌందర్యను సావిత్రితో పోల్చేవారు.
బాలకృష్ణ అప్పట్లో స్వీయ దర్శకత్వంలో 'నర్తనశాల' సినిమా చేయాలనుకున్నారు. అందులో ద్రౌపదిగా సౌందర్యను తీసుకున్నారు కూడా. అంతాబావుంటే... సావిత్రి ద్రౌపదిగా చూసిన మనం... సౌందర్యను కూడా ఆ పాత్రలో చూసుకునేవాళ్లం. కానీ.. విధి వేరేలా నిర్ణయించింది. విమాన ప్రమాదం సౌందర్యను బలి తీసుకుంది.
సరదాగా మాట్లాడుకుంటే... రీసెంట్ గా 'మహానటి'లో కీర్తి సురేశ్ నటించింది కానీ... అదే ఆ సినిమా ఓ ఇరవైఏళ్ల క్రితం తీసి.. అందులో సౌందర్య నటించి ఉంటే.. ఎలా ఉండేదో ఊహించుకోండి. తెరపై నిజంగా సావిత్రమ్మనే చూసేవాళ్లం కదా.
ఇక నటనలో అయితే... శ్రీదేవి పోకడలు ఎక్కువగా కనిపించేవి తనలో, పాటల్లో హావభావాలు, ఆ హాస్య చెతురత, ఆ చిలిపితనం, ఆ వయ్యారం.. అంతా శ్రీదేవినే గుర్తు చేసేవి. చూడాలని ఉంది, దొంగాట, అన్నయ్య సినిమాల్లో అయితే.. మనకు ఆ పోలికలు ప్రస్పుటంగా కనిపిస్తాయ్.. కావాలంటే చూడoడి.
సౌందర్య వందవ సినిమా 'శ్వేతనాగు'. అదే ఆమె చివరి సినిమా కూడా, ఈ ఇరవై ఏళ్లల్లో వంద సినిమాల హీరోయిన్ అంటే.. సౌందర్య మాత్రమే. అంతేకాదు.. హీరోయిన్లలో ఎక్కువకాలం నంబర్ వన్ చైర్ లో కూర్చున్న సూపర్ స్టార్ కూడా తనే. ఏదిఏమైనా.. చిన్నవయసులోనే అందర్నీ వదిలివెళ్లి ప్రేక్షకలోకానికి పుట్టెడు విషాదాన్ని మిగిల్చింది సౌందర్య, భౌతికంగా తను దూరమైన.. భావాల్లో మాత్రం ఇంకా బతికేవుంది.
నేడు ఈ అద్భుతనటి పుట్టిన రోజు. ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది తెలుగువన్.