ఎన్టీఆర్కు చెయ్యెత్తి జైకొట్టిన తెలుగోడు! పాటలు సృష్టించిన ప్రభంజనం!!
on May 27, 2020
ఆడియో క్యాసెట్లు కొత్తగా వస్తున్న రోజులు.. అప్పటి దాకా జన బాహుళ్యంలో ఎల్పీ, ఈపీ రికార్డులే ఎక్కువగా వినిపించేవి. అవి ఖరీదెక్కువ. డబ్బున్నవాళ్ల ఇంట్లోనో, సినిమా హాళ్లలోనో, ఏ వేడుకలోనో అవి వినిపిస్తూ ఉండేవి. ఆ రోజుల్లో రేడియోలో కాకుండా బయట పాట వినాలంటే రికార్డు ప్లేయర్లు ఉండాల్సిందే. అలా కాకుండా ఒక టేప్ రికార్డర్, దానిలో ఒక చిన్న క్యాసెట్ పెట్టేసి వినడం ఈజీగా ఉండటంతో వాటివైపు జనం ఆకర్షితులవుతున్న రోజులవి. 1982లో ఆ క్యాసెట్లను ఎక్కువగా వాడింది తెలుగుదేశం పార్టీనే. సినిమాల కంటే కూడా ఆ పార్టీకే ఈ ఆడియో క్యాసెట్లను ఎక్కువగా వాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఆడియో క్యాసెట్లకు అనధికార బ్రాండ్ అంబాసిడర్ ఎన్టీఆర్. జనంలో క్యాసెట్ల వాడకాన్ని పెంచింది ఎన్టీఆర్.
రికార్డు ప్లేయర్ ధర కానీ, డిస్క్ రూపంలో ఉండే రికార్డ్ ధర కానీ ఎక్కువగా ఉండేది. అదే ఆడియో క్యాసెట్ 30 రూపాయలకే వచ్చేది. రికార్డ్ మీద కంటే క్యాసెట్లో ఎక్కువ పాటల్ని స్టోర్ చేసే అవకాశం ఉండటంతో చాలా త్వరగా క్యాసెట్లు వాడకంలోకి వచ్చాయి. ఆ టైమ్లో పాటల్ని పాడించి, వాటిని క్యాసెట్ల రూపంలో అన్ని ప్రాంతాల్లో పార్టీ ఆఫీసులకు పంపించారు ఎన్టీఆర్. ఆ క్యాసెట్లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కాపీలు తీయించి పెట్టేవాళ్లు. ఆ క్యాసెట్లలో ఎన్టీఆర్ ప్రసంగం, పాటలు.. రెండూ ఉండేవి. ఎక్కడ పట్టినా అవే మోగుతూ ఉండేవి. ఈ పాటలు తెలుగుదేశం పార్టీకి అదనపు ప్రచారాన్నివ్వడమే కాకుండా, తొలి ఎన్నికల్లోనే ఎన్టీఆర్ ప్రభంజనానికి కీలక పాత్ర పోషించాయి. ఇవాళ అంటే సునాయాస ప్రచారం కోసం సోషల్ మీడియా ఉంది కానీ ఆ రోజుల్లో కేవలం పాటలతో, తన ప్రసంగాలతో తనే ఒక సోషల్ మీడియాగా అవతరించారు ఎన్టీఆర్. తెలుగుదేశం పాటలు, ఎన్టీఆర్ ప్రసంగాలతో కూడిన ఆడియో క్యాసెట్లు తెలుగునాడు వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రచారంలోకి వచ్చి ఒక వేవ్ని సృష్టించాయి.
తెలుగుదేశం పార్టీ ప్రచారంలో ఎన్నో పాటలు వచ్చినప్పటికీ, వాటిలో విశేష ప్రాచుర్యం పొందిన పాటలు.. సుందరంబాడి శంకరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’, వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా’, సి. నారాయణరెడ్డి రచించిన ‘సాగిరారా తెలుగోడా సాగిరా’, ‘ ఇది తెలుగుగడ్డ గాండ్రించు పులిబిడ్డ’, ‘తెలుగుదేశం వీరావేశం తెలుగుజాతి ఆశాజ్యోతి రామారావ్ ఎన్టీ రామారావ్ మన రామారావ్ మన తారకరామారావ్’. వీటిలో సినారె తన పేరు లేకుండా ఆ పాటలను వాడుకోవాల్సిందిగా కోరడంతో అలాగే చేశారు ఎన్టీఆర్. కారణం ఇందిరా గాంధీ దృష్టిలో పడటం సినారెకు ఇష్టం లేకపోవడం. ఈ పాటలన్నింటికీ మ్యూజిక్ చక్రవర్తి ఇచ్చారు. చక్రవర్తిని ఎన్టీఆర్ పిలిచి అడిగితే, ఆయన దాపరికం లేకుండా తాను మ్యూజిక్ చేస్తానని చెప్పి అలాగే చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా తనకు స్టార్డమ్ వచ్చింది ఎన్టీఆర్ వల్లనే అని నమ్మిన ఆయన ఎన్టీఆర్ చేస్తున్న యజ్ఞంలో తన వంతు పాత్ర పోషిస్తానని ధైర్యంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రచార పాటలకు బాణీలు కట్టే అవకాశం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.
‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటకు అప్పటివరకూ ప్రార్థనా గీతం శైలి ట్యూన్ ఉండేది. పార్టీ ప్రచారం కోసం జనంలో ఊపు తీసుకొచ్చే విధంగా ఆ ట్యూన్ స్పీడ్ పెంచి మెలోడియస్గా కొట్టారు చక్రవర్తి. ఈ పాటలను, డబ్బింగ్ థియేటర్లో ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్లను కలిపి క్యాసెట్లు తయారు చేశారు. ఇప్పటికీ రింగ్టోన్లుగా ఆ పాటలు, ఆ స్పీచ్లలోని మాటలు వినిపిస్తుండటం పెద్ద విశేషం. ‘తేనెలాంటి భాష మనది.. స్వచ్ఛమైన జాతి మనది’ అనే రింగ్టోన్ సూపర్ పాపులర్.
ఈ పాటలతో పాటు ‘వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది’ అనే పాట, 'చండశాసనుడు' సినిమాలోని ‘దేశమంటే మట్టికాదోయ్’, ‘జనం తిరగబడుతోంది ధనం ఉలికిపడుతోంది’ పాటలు కూడా ప్రజల్ని బాగా ప్రభావితం చేశాయి. వీటన్నింటినీ సినారె రాశారు. వీటిలో ‘వచ్చిందోయ్ వచ్చింది తెలుగుదేశమే వచ్చింది’ పాటకు శ్రీశ్రీ రాసిన ఓ పాట మూలమనీ, దాని ఆధారంగా సినారె ఈ పాటను రాశారనీ అంటారు.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాట వినిపించిందంటే చాలు ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార వాహనం చైతన్యరథం వచ్చిందని జనం దాని దగ్గరకు పరిగెత్తుకెళ్లేవాళ్లు. ఆ పాటతో పాటు ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా పాట’ చైతన్యరథంపై ఎక్కువగా వినిపించేది. ఊళ్లల్లోంచి చైతన్యరథం వెళ్లేప్పుడు టాప్ మీదనుంచి ఎన్టీఆర్ జనానికి చేతులెత్తి నమస్కారం పెడుతుండేవారు. ఆ టైమ్లో ఈ పాటను ప్లే చేసేవాళ్లు.
ఒకవైపు పాటలు, మరోవైపు తారకరాముని ప్రసంగాలతో జనం ఉర్రూతలూగిపోయారు. తెలుగువాడి ఆత్మగౌరవం ఎలాంటిదో చూపించాలని తపించిపోయారు. ఫలితంగా 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్టీ పెట్టిన తొమ్మదంటే తొమ్మిది నెలలకే ఎన్టీఆర్కు, తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టారు. మదనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి చనిపోవడంతో ఆ స్థానం మినహా మిగతా 293 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం 202 స్థానాలను గెలిచి, ఇందిరా కాంగ్రెస్ను మట్టి కరిపించింది. ఆనాడు కాంగ్రెస్కు దక్కింది 60 స్థానాలే. స్వతంత్ర భారతావనిలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్కు ఇంత తక్కువ స్థానాలు రావడం అదే ప్రథమం. అంతకుముందు కాంగ్రెస్కు వచ్చిన తక్కువ స్థానాలు 163. అంటే ఏ స్థాయిలో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారో ఊహించుకోవచ్చు. మే 9న అశేష ప్రజానీకం సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తెలుగువారి చారిత్రక పురుషునిగా, వారి హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానాయకునిగా నందమూరి తారకరామారావు నిలిచిపోయారు. ఆయన సృష్టించిన చరిత్ర అనితరసాధ్యం, ఆయన జన సమ్మోహనశక్తి అపూర్వం, ఆయన తెచ్చిన పాలనా సంస్కరణలు అమోఘం. అందుకే ఆయన యుగపురుషుడు!
(మే 28 నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా..)