కరోనాతో హాస్పిటల్లో చేరిన ఎస్పీ బాలు
on Aug 5, 2020
గానగంధర్వుడు ఎస్వీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ బారినపడ్డారు. టెస్టులో ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే తనకు అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయనీ, తన ఇంట్లోనే 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉండమని డాక్టర్లు సూచించారనీ ఆయన తెలిపారు. అయితే 74 సంవత్సరాల బాలు ఎలాంటి చాన్స్ తీసుకోదలచుకోలేదు. వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఒక వీడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.
"గత రెండు రోజులుగా ఛాతీ దగ్గర అసౌకర్యంగా ఉండటం, కఫం వస్తుండటం, జలుబు, వచ్చీ పోతున్న జ్వరంతో కొంచెం ఇబ్బందిగా ఫీలవుతూ వచ్చాను. అంతకు మించి పెద్దగా ఏమీ లక్షణాలు లేవు. కానీ నేను దాన్ని ఈజీగా తీసుకోలేదు. హాస్పిటల్కు వెళ్లి, చెక్ చేయించాను. దాంతో వెరీ మైల్డ్ సింప్టమ్స్తో కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్లు టెస్టులో నిర్ధారణ అయ్యింది. ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండమని వైద్యులు సూచించారు. నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్కు ఎలాంటి ట్రబుల్ కలిగించదలచుకోలేదు. అందుకే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. నా డాక్టర్ ఫ్రెండ్స్, హాస్పిటల్ సిబ్బంది నన్ను శ్రద్ధగా చూసుకుంటున్నారు" అని ఆ వీడియో సందేహంలో బాలు తెలియజేశారు.
తను బాగానే ఉన్నాననీ, ఈ స్థితిని గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాననీ బాలు చెప్పారు. తన అభిమానులు, స్నేహితులను ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపిన ఆయన వాళ్లను తనను కాంటాక్ట్ చేయవద్దనీ, తనకు విశ్రాంతి కల్పించమనీ కోరారు.