'దిశ ఎన్కౌంటర్' విషయంలోనూ చిక్కుల్లో ఆర్జీవీ!
on Nov 24, 2020
నిన్నగాక మొన్న 'మర్డర్' మూవీ విషయంలో న్యాయపరమైన ఆటంకాలు ఎదుర్కొని బయటపడిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన రాబోయే మరో చిత్రం 'దిశ ఎన్కౌంటర్' విషయంలోనూ చట్టపరమైన ఇబ్బందుల్లో పడ్డారు. ఇది గత సంవత్సరం జరిగిన విషాద దిశ తరహా ఘటనల ఆధారంగా రూపొందింది. దిశ కేసులో నలుగురు నిందితుల కుటుంబీకులు దాఖలు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు రామ్ గోపాల్ వర్మకు షో కాజ్ నోటీసు జారీ చేసింది.
దిశపై దాడి చేసి, ఆమెను కిరాతకంగా హత్య చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు రామ్ గోపాల్ వర్మ తమను 'దిశ ఎన్కౌంటర్' మూవీలో చెడుగా చూపిస్తున్నారని ఆ కేసులో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం తన క్లయింట్లను తీవ్ర మానసిక ఆందోళనలకు గురిచేస్తోందని నిందితుల కుటుంబ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది అన్నారు.
'దిశ ఎన్కౌంటర్' మూవీని థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతించరాదని న్యాయవాది వాదించారు. ఆర్జీవీ ఇప్పుడు షో-కాజ్ నోటీసుకు ప్రతిస్పందించాల్సి ఉంది.