రష్మికతో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అంటున్న శర్వానంద్!
on Oct 25, 2020
కంటెంట్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఒప్పుకున్న లేటెస్ట్ ఫిల్మ్ 'ఆడాళ్లూ మీకు జోహార్లు'. నేను.. శైలజ, చిత్రలహరి లాంటి చిత్రాలు అందించిన డైరెక్టర్ కిశోర్ తిరుమల ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో శర్వా జోడీగా తొలిసారి సంచలన కథానాయిక రష్మిక మందన్న నటిస్తోంది. దసరా సందర్భంగా ఆదివారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. దీనికి శర్వా, రష్మిక ఇద్దరూ హాజరయ్యారు.
వారిపై చిత్రీకరించిన మహూర్తపు షాట్కు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి క్లాప్ కొట్టారు. ఈ సినిమా స్క్రిప్ట్ను దర్శక నిర్మాతలకు అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ ప్లస్ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంట అందజేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీకి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు.
గతంలో 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్తో కృష్ణంరాజు సినిమా వచ్చింది. ఆసక్తిని రేకెత్తించే ఈ టైటిల్తో ఇప్పుడు శర్వానంద్ సినిమా చేస్తుండటం, అందులో రష్మిక హీరోయిన్ కావడంతో వారి ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read