నటి రాధిక భర్త పై కేసు..!
on May 10, 2016
తమిళ నటి రాధిక భర్త నటుడు శరత్ కుమార్ పై కేసు నమోదైంది. తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న శరత్ కుమార్ పై ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. రీసెంట్ గా ఆయన కారు నుంచి 9 లక్షల రూపాయల క్యాష్ ను పోలీసులు రికవర్ చేశారు. మే 7 వ తేదీన నల్లూర్ ప్రాంతంలో, ఎలక్షన్ అధికారులు కార్లను తనిఖీ చేశారు. ఆ సమయంలో శరత్ కుమార్ కారులో 9 లక్షల రూపాయల నగదు దొరికింది. ఎలక్షన్ల సమయంలో ఇంత మొత్తాన్ని తరలించడం నియమావళి ఉల్లంఘనే అని, దీనికి శరత్ కుమార్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అరుముగనేరి ప్రత్యేక తహసీల్దార్ చెప్పారు. కాగా, ఆల్ ఇండియా సమతువా మక్కల్ కట్చి పార్టీకి ఛీఫ్ అయిన శరత్ కుమార్, అన్నాడిఎంకే తో కలిసి పోటీచేస్తున్నారు. ఎఐడిఎంకే గుర్తు మీదే, తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతున్నారు. కాగా, తనపై ఇది ప్రత్యర్ధుల కుట్ర అని ఆరోపించారు శరత్ కుమార్. ఎలక్షన్లో ప్రజలు తనకు ఓట్లేసి న్యాయం వాళ్లే చెబుతారని ఆయన అంటున్నారు. తమిళనాట ఎలక్షన్లతో, రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.