షారుఖ్ కోసం ..అభిమాని మృతి
on Jan 24, 2017
భారత దేశంలో సినీ తారలకు ఉన్న క్రేజ్ మరెవ్వరికీ ఉండదు..జీవితంలో ఒక్కసారైనా తమ అభిమాన తారను చూడాలనుకుంటారు ఈ దేశంలో అభిమానులు..కానీ అభిమానం ఒక్కోసారి విషాధానికి కారణమవుతూ ఉంటుంది. తాజాగా జరిగిన ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. దేశంలో ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఆయన తాజా చిత్రం "రయీస్" ప్రమోషన్లో భాగంగా షారుఖ్ ఖాన్ చిత్ర యూనిట్తో పాటు ముంబై సెంట్రల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు అగస్త్ క్రాంతి రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణించాడు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పలు స్టేషన్లలో షారుఖ్ని చూడటం కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో గుజరాత్లోని వడోదర స్టేషన్లో అపశృతి చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో రైలు వడోదర స్టేషన్కు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం..ఇంతలో రైలు బయలుదేరడంతో ఫ్యాన్స్ దాని వెంట పరుగులు తీశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న షారుఖ్ ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.