తేజ-ఆర్పీ కాంబినేషన్.. 'చిత్రం' సీక్వెల్ 'చిత్రం 1.1'
on Feb 22, 2021
డైరెక్టర్ తేజ కెరీర్ బిగినింగ్లో కొన్ని బ్లాక్బస్టర్ సినిమాలను అందించారు. అయితే, ఆయన దర్శకునిగా పరిచయమైన 'చిత్రం' ఆయన కెరీర్లోనే ఒక ప్రత్యేకమైన చిత్రం. యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తేజ తీర్చిదిద్దిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఆ ఫిల్మ్తోటే దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సమకూర్చిన సంగీతం ఒక హైలైట్గా నిలవడమే కాకుండా, పాటలన్నీ ఒక సెన్సేషన్ను సృష్టించాయి.
నేడు తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'చిత్రం'కు సీక్వెల్ను ప్రకటించారు. అంతా కొత్త తారలు నటించే ఆ మూవీకి 'చిత్రం 1.1' అనే టైటిల్ ఖరారు చేశారు. మ్యూజికల్ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ సినిమా ద్వారా 45 మంది కొత్తవారిని తేజ పరిచయం చేస్తున్నారు.
టైటిల్ పోస్టర్ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. దాంతో పాటు, "Here comes the blasting announcement that many are waiting for.... wishing Teja garu a happy birthday. Wait for a musical blast from us with this CHITRAM 1.1 (చాలా మంది ఎదురుచూస్తున్న బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తేజగారికి హ్యాపీ బర్త్డే. ఈ చిత్రం 1.1తో మేం అందించే మ్యూజికల్ బ్లాస్ట్ కోసం వెయిట్ చేయండి.)" అంటూ రాసుకొచ్చారు.
'చిత్రం 1.1'తో తేజ, ఆర్పీ పట్నాయక్ బ్లాక్బస్టర్ కాంబినేషన్ మళ్లీ వస్తోంది. 'చిత్రం' తరహాలోనే ఈ సీక్వెల్ సైతం మ్యూజికల్ హిట్టవుతుందేమో చూడాలి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్గా, శంకర్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. చిత్రం మూవీస్ బ్యానర్పై తేజ స్వయంగా నిర్మిస్తున్న ఈ ఫిల్మ్కు ఎస్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామి.
మార్చిలో 'చిత్రం 1.1' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. త్వరలో ఇతర వివరాలను వెల్లడిస్తారు.
Also Read