ఆర్జీవీపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసు!
on Jul 5, 2020
'మర్డర్' మూవీ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ, ప్రొడ్యూసర్ నట్టి కరుణపై నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 'మర్డర్' సినిమా ప్రమోషన్ కోసం తన కుమారుడు ప్రణయ్, కోడలు అమృత, ఆమె తండ్రి మారుతీరావు ఫొటోలు వాడారంటూ బాలస్వామి మిర్యాలగూడ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. ఆ సినిమా చిత్రీకరణను నిలిపి వేయాల్సిందిగా కోర్టును అభ్యర్థించారు.
ఈ కేసును విచారించిన కోర్టు సినిమా షూటింగ్ను నిలిపివేయాలనే అభ్యర్థనను తోచిపుచ్చింది. అయితే ప్రణయ్, అమృత, మారుతీరావు ఫొటోలను ప్రచారం కోసం ఉపయోగించడంపై నిర్మాత, దర్శకులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్జీవీ, నట్టి కరుణపై కేసు నమోదు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ వెంకట రంగనాథ్ తెలిపారు.
"హ్యాపీ ఫాదర్స్ డే రోజున శాడ్ ఫాదర్స్ డే సినిమా ప్రకటిస్తున్నా. కూతురుని తండ్రి అతిగా ప్రేమించడం వల్ల వచ్చే అనర్థాల ఫలితాలను సినిమాలో చూపిస్తున్నా. అమృత, మారుతీరావు కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను హృదయాలను కదిలిస్తుంది" అని రామ్ గోపాల్ వర్మ జూన్ 22న ట్వీట్ చేశారు. అంతకు ముందు అమృత, మారుతీరావు ఫొటోలతో వాళ్లపై సినిమా తీస్తున్నట్టు మరో ట్వీట్ చేశారు. సినిమాకు 'మర్డర్' అని టైటిల్ పెట్టారు. దీనిబట్టి ప్రణయ్ హత్య ప్రధానాంశంగా వర్మ సినిమా తీస్తున్నారని అర్థమైంది.