ఆ డైరెక్టర్కు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదు!
on Apr 14, 2021
మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేసిన 'డిస్కోరాజా'లో ప్రతినాయకుడిగా నటించాడు బాబీ సింహా. కట్ చేస్తే.. తమిళంలో బాబీ సింహా హీరోగా ఓ సినిమాని తెరకెక్కించిన యువ దర్శకుడితో తన నెక్స్ట్ వెంచర్ చేస్తున్నాడు రవితేజ.
ఆ వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ళ క్రితం బాబీ సింహా, నిక్కీ గల్రాణి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో 'కో 2' (2016) పేరుతో ఓ పొలిటికల్ థ్రిల్లర్ రూపొందింది. నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన తెలుగు చిత్రం 'ప్రతినిధి'కి తమిళ వెర్షన్ గా రూపొందిన ఆ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా తొలి అడుగేశాడు. తమిళనాట విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
కట్ చేస్తే.. ఇప్పుడీ దర్శకుడు రవితేజ సినిమాతో తెలుగునాట కూడా అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సుధాకర్ చెరుకూరి నిర్మించే ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది.
అయితే ఈ సినిమాతోనే శరత్ డైరెక్టర్గా పరిచయమవుతున్నట్లు ప్రచారంలోకి రావడం గమనార్హం. ఐదేళ్ల క్రితమే డైరెక్టర్ అయిన అతను రెండో సినిమాని డైరెక్ట్ చేయడానికి ఇంత సమయం తీసుకున్నాడు. మరి.. శరత్ కి ఈ చిత్రం ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.