నాగచైతన్యతో విడిపోయాక రెండో బైలింగ్వల్ మూవీకి సంతకం చేసిన సమంత!
on Oct 16, 2021
సమంత దూకుడు పెంచింది! పర్సనల్ లైఫ్లో ఎదురైన సమస్యల నుంచి బయటకొచ్చి ప్రొఫెషనల్గా బిజీగా మారే క్రమంలో వరుసగా సినిమాలు సంతకం చేస్తూ వస్తోందామె. దసరా సందర్భంగా తన రెండో తెలుగు-తమిళ బైలింగ్వల్ ఫిల్మ్కు సంతకం చేసింది. దీనిని హరీశ్ నారాయణ్, హరి శంకర్ అనే నూతన దర్శక ద్వయం తెరకెక్కించనుంది. అంతకుముందే శంతరూబన్ డైరెక్షన్లో సమంత ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నట్లు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేతల్లో ఒకరైన ఎస్.ఆర్. ప్రభు ప్రకటించారు.
నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించాక సోషల్ మీడియాలో సమంత దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొంది. పరస్పర అంగీకారంతో ఆ ఇద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కలిసి ఉండటం కష్టమని నిర్ధారించుకున్నాక, తమ నాలుగేళ్ల అన్యోన్య దాంపత్యానికి సమంత, చైతూ ముగింపు పలికారు.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ రిలీజయ్యాక, ఓ నెల రోజుల పాటు వర్క్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమంత వెల్లడించింది. ఇప్పుడు, కొత్త డైరెక్టర్లతో రెండు బైలింగ్వల్ ఫిలిమ్స్ చేయడానికి ఆమె అంగీకరించింది.
హరీశ్ నారాయణ్, హరి శంకర్ కలిసి డైరెక్ట్ చేసే మూవీని శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించనున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ నవంబర్లో స్టార్టవుతుంది.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో ‘జెంటిల్మన్’, సుధీర్బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్లో తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.