"గుడికి వచ్చి.. బుద్ధుందా?".. మీడియాపై సమంత చిందులు!
on Sep 18, 2021
నటి సమంత అక్కినేని శనివారం ఉదయం తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలో పాల్గొన్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆమెతో పాటు మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. గుడి వెలుపల ఆమెను ఫొటోలు తీయడానికి, ఆమెతో మాట్లాడించడానికి మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. కానీ ఆమె మేనేజర్ మహేంద్ర పడనీయలేదు. "మేడమ్ ఒక్క సెకన్. ఒక్క ఫొటో తీయనివ్వండి" అని ఫొటోగ్రాఫర్ అడుగుతుంటే, "లేదు.. లేదు.. పదండి" అని వారిని దగ్గరకు రానీయలేదు. ఆమె నడుస్తుండగానే వారు ఫొటోలు తీసుకుంటూ వచ్చారు. కెమెరామెన్లు వీడియో తీశారు.
కనీసం ఆమె పెట్టుకున్న మాస్క్ తీయించాలని కూడా ఫొటోగ్రాఫర్లు, కెమెరామన్లు ప్రయత్నించారు. "ప్లీజ్ మేడమ్.. ఒక్కసారి మాస్క్ తీయండి" అని అభ్యర్థించారు. కానీ ఆమె వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. తన దగ్గరకు వస్తున్న కెమెరామన్లను "స్టాప్" అని సూచించారు. ఒక రిపోర్టర్ ఒక బైట్ ఇవ్వమని అడిగితే, వేలిని తలదగ్గర తిప్పుతూ "గుడికి వచ్చి.. బుద్ధుందా" అని చికాకు పడ్డారు. ఆమె ఎందుకు అలా అన్నారో అర్థం కాలేదు. నాగచైతన్య, సమంత మధ్య కలతలు రేగాయనీ, ఇద్దరూ విడాకులు తీసుకోనున్నారనీ కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో, మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. బహుశా రిపోర్టర్ దాని గురించి అడిగుంటాడని ఊహించుకొని ఆమె అలా చిరాకుపడినట్లు కనిపిస్తోంది.
అంతకుముందు సమంత శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని వాయు లింగేశ్వరస్వామి గుడిని సందర్శించారు. ఆలయంలో ఆమె రాహుకేతుల పూజ నిర్వహించారు. స్వామివారి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆమెకు గురుదక్షిణామూర్తి దగ్గర వేద పండితులు ఆశీర్వదించారు. అధికారులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గతంలో ఆమె శ్రీకాళహస్తికి, తిరుమలకు భర్త నాగచైతన్యతో కలిసి వచ్చారు. ఇప్పుడు ఆయన లేకుండా ఆమె ఒంటరిగా ఆలయాలకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఇద్దరి మధ్యా అంతా సవ్యంగా లేదనడానికి ఇది మరో నిదర్శనమనీ జనం అనుకుంటున్నారు.
Also Read