విమర్శలను ఎదుర్కొంటున్న 'సామజవరగమన' సాంగ్...
on Oct 7, 2019
'అల.. వైకుంఠపురములో' నుంచి ఓ సాంగ్ విడుదలైంది, దుమారం మొదలైంది, పాట బావుందనే ప్రశంసలు ఒకవైపు సాగుతూ ఉంటే విమర్శల దుమారం కూడా అదే రేంజ్ లో సాగుతోంది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సక్సెస్ ల తర్వాత మూడో సారి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'అల.. వైకుంఠపురములో'. టైటిల్ ఎంత వెరైటీగా ఉందో, అంతే ఆసక్తికరంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ మధ్యే వచ్చిన తొలి లిరికల్ మాత్రం సెన్సేషన్ గా మారిపోయింది. తమన్ అందించిన మ్యూజికల్ ని చాలా మంది శ్రోతలు పదేపదే వింటున్నారు. సిద్ శ్రీరామ్ ప్రత్యేకమైన వాయిస్ తో సిరివెన్నెల సాహిత్యం సంగీత ప్రియులకు తెగ నచ్చేసింది కానీ, ఈ పాట బావుందని ఎంతమంది ఆకాశానికి ఎత్తుతున్నారో అదే రేంజ్ లో విమర్శలు కూడా ఎదురవుతున్నాయి.
'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి విడుదలైన తొలి లిరికల్ 'సామజవరగమన'. అచ్చ తెలుగు పదాలతో సాగిన ఈ పాటని సిద్ శ్రీరామ్ తో పాడించాడు సంగీత దర్శకుడు తమన్. సహజంగానే సింగర్ తెలుగు వాడు కాదు కాబట్టి పాటలో కొన్ని పదాలు భిన్నంగా పలికాడు. కానీ, నెటిజన్స్ వాటి గురించి భారీగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ కూడా గొంతు కలిపినట్లు కన్పిస్తోంది. ఆయన తన తాజా ట్వీట్ లో "నీ ఉచ్ఛారణకి నా జోహార్ లు. కేవలం నీ టైం నడుస్తుంది కాబట్టి నువ్వెలా ఖూనీచేసి పాడినా దానిని అదే మహాప్రసాదం అని భావించిన ఆ సంగీత దర్శకుడికి సాష్టాంగ ప్రణామాలు" అని రాశాడు. దీంట్లో ఎక్కడా సిద్ శ్రీరామ్ పేరు, తమన్ పేరు, కనీసం సినిమా పేరు కూడా వాడకున్నా సోషల్ మీడియా జనం మాత్రం ఆ ట్వీట్ 'సామజవరగమన' పాట గురించే అంటున్నారు. కల్యాణి మాలిక్ సిద్ శ్రీరామ్ ని టార్గెట్ చేశాడని తెలుస్తోంది, ముందు ముందు ఇది ఎటువంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి.