'చిత్రలహరి' నుండి బయటకు రావడం కష్టమైందట
on Dec 19, 2019
'చిత్రలహరి' విజయం తరవాత సాయిధరమ్ తేజ్ నటించిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. ఇందులో తాతయ్య సంతోషం కోసం కృషి చేసిన మనవడి పాత్రలో నటించాడు. ఇదొక హుషారైన పాత్ర. ఐదు వారాల్లో తాతయ్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతాడని తెలిశాక... జీవితంలో కోల్పోయిన సంతోషాలను తిరిగి తాతయ్యకు ఇచ్చే పాత్ర. ఇందులో ఇమిడిపోవడానికి సాయి ధరమ్ తేజ్ కు ఒక వారం పట్టిందట. 'చిత్రలహరి'లో పాత్ర నుండి బయటకు రాలేక బాగా కష్టపడ్డాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు.
"ప్రతిరోజూ పండగే' షూటింగ్ స్టార్ట్ చేశాం. సీన్స్ చేస్తున్నాం. కానీ, మారుతి అన్న సంతృప్తిగా లేడు. 'తేజూ ఏదో మిస్ అవుతుంది' అనేవాడు. నాకు అర్ధమయ్యేది కాదు. ఒకరోజు నా ఫ్రెండ్ ఒకడు సెట్ కి వచ్చాడు. తను చూసి 'నువ్వు ఇంకా చిత్రలహరి క్యారెక్టర్ లో ఉన్నావ్' అన్నాడు. నేను తప్పు ఎక్కడ చేస్తున్నానో తెలిసింది. తర్వాత కరెక్ట్ చేసేశా. 'చిత్రలహరి' చేసేటప్పుడు నా రియల్ లైఫ్ సిట్యువేషన్స్ కి క్యారెక్టర్ కనెక్ట్ అయింది. అప్పట్లో నేను ప్లాప్స్ లో ఉన్నాను. అలా చేసేశా. 'ప్రతిరోజూ పండగే'కి క్యారెక్టర్ నుండి బయటకు వచ్చా" అని సాయిధరమ్ తేజ్ చెప్పాడు. ఈ సినిమాకు, 'శతమానం భవతి' సినిమాకు సంబంధమే లేదన్నాడు.