'సాహో'కి సగం టెన్షన్ తీరింది!
on Feb 5, 2019
విజువల్ ఎఫెక్ట్స్ అనుకోండి... గ్రాఫిక్స్ అనుకోండి... సీజీ వర్క్ అనుకోండి... పిలుపు ఏదైనా పని ఒక్కటే! ఇటీవల దర్శక నిర్మాతలను బాగా టెన్షన్ పెడుతున్న పని ఇది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో సినిమా కి ఈ టెన్షన్ సగం తీరింది. అసలు విషయం ఏంటంటే... సాహో విజువల్ ఎఫెక్ట్స్ 50% పూర్తయ్యాయి. మిగిలిన 50 పర్సెంట్ త్వరలో పూర్తి చేస్తారు. ఎందుకంటే... విజువల్ ఎఫెక్ట్స్ చేయాల్సిన షాట్స్ అన్ని ఎప్పుడో షూటింగ్ చేసేసి పంపించారు సినిమా యూనిట్. అందువల్ల, సకాలంలో సినిమా విడుదల అవుతుందా? లేదా? అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ముందుగా ప్రకటించినట్టు ఆగస్టు నెలలో సినిమా విడుదలవుతుంది. 'రన్ రాజా రన్' ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు మూడు వందల కోట్లు దాటుతుందని సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడడం లేదు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలో ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు హిందీ తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిరా బేడి, చంకీ పాండే తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.