అరగంటలో బుల్లెట్ డ్రైవింగ్ నేర్చుకుందట
on Feb 18, 2020
హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ నటించిన తాజా సినిమా 'కనులు కనులను దోచాయంటే'. ఇటీవల ఈ సినిమాలో 'గుండెగిల్లి ప్రాణం తీయ్యెద్దే' పాటను విడుదల చేశారు. అందులో రీతూ వర్మ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తుంది. స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ సీన్ లేదట. సడన్ గా దర్శకుడు హీరోయిన్ చేత బైక్ డ్రైవింగ్ చేయిస్తే బావుంటుందని యాడ్ చేశారు. దాంతో అప్పటికప్పుడు అరగంటలో రీతూ వర్మ బైక్ డ్రైవింగ్ నేర్చుకోవలసి వచ్చింది. "నన్ను నమ్మండి... ఫస్ట్ బుల్లెట్ రైడ్ చేయాలని చెప్పినప్పుడు భయపడ్డా. సెట్ లో అప్పటికప్పుడు దర్శకుడు తీసుకున్న నిర్ణయం అది. సాంగులోని ఒక మాంటేజ్ సీన్ లో నేను బుల్లెట్ రైడ్ చేస్తే బావుంటుందని దర్శకుడు చెప్పారు. నాకు బైక్ రైడ్ చేయడం రాదు. కానీ, చిన్నప్పుడు సైకిల్ తొక్కాను. అందువల్ల, ఎలాగోలా బైక్ బ్యాలన్స్ చేయడం వచ్చింది. దుల్కర్ సల్మాన్ సహాయంతో అరగంటలో బుల్లెట్ నేర్చుకున్నాను. కానీ, ఆ బండి చాలా బరువుగా ఉంది" అని రీతూ వర్మ పేర్కొంది. 'మహానటి'లో జెమినీ గణేశన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరో. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. ఇందులో ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ ఇంపార్టెంట్ రోల్ చేశారు.