పాయల్ కాంప్రమైజ్.. రిచాకు అపాలజీస్!
on Oct 14, 2020
తారలు రిచా చాధా, పాయల్ ఘోష్ తమ మధ్య వివాదాన్ని సయోధ్యతో పరిష్కరించుకున్నామని, దీనికి సంబంధించి సమ్మతి పత్రాలను దాఖలు చేశామని బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపారు. రిచాపై తను ఇచ్చిన స్టేట్మెంట్ను ఉపసంహరించుకుంటున్నాననీ, ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నాననీ పాయల్ తెలిపింది. తనపై తప్పుడు, ఆధారరహిత, అవమానకర, అభ్యంతరకర స్టేట్మెంట్ ఇచ్చినందుకు గాను పాయల్పై గత వారం రిచా పరువునష్టం దావా వేసింది. నష్ట పరిహారం కింద రూ. 1.1 కోట్లను ఆమె నుంచి ఇప్పించాల్సిందిగా కోర్టును అభ్యర్థించింది.
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించిన పాయల్.. ఆ వివాదంలోకి రిచా చాధాతో పాటు మరో ఇద్దరు తారల పేర్లను కూడా లాగింది. బుధవారం పాయల్ తరపున కోర్టుకు హాజరైన ఆమె లాయర్ నితిన్ సత్పుటే రెండు పార్టీలు (రిచా, పాయల్) తమ మధ్య వ్యవహారాన్ని సయోధ్యతో కోర్టు బయట పరిష్కరించుకున్నారని తెలియజేస్తూ దానికి సంబంధించిన స్టేట్మెంట్ను జస్టిస్ ఎ.కె. మీనన్కు అందజేశారు.
అందులో రిచాపై తాను చేసిన ప్రకటనను ఉపసహరించుకుంటూ, ఆమెకు క్షమాపణలు తెలియజేస్తున్నానని పాయల్ పేర్కొంది. దాంతో నష్టపరిహారం డిమాండ్ను రిచా కూడా విరమించుకుంటున్నట్లు ఆమె లాయర్లు వీరేంద్ర తుల్జాపుర్కార్, సవీనా బేడీ సచార్ కోర్టుకు తెలిపారు. రిచా, పాయల్ తమ మధ్య వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నందున పాయల్పై రిచా వేసిన పరువునష్టం దావాను జస్టిస్ మీనన్ కొట్టివేశారు.
Also Read