ఆశ్చర్యం.. ఆర్జీవీ 'మర్డర్' థియేటర్లలోనే విడుదలవుతుంది!
on Aug 4, 2020
సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్యోదంతంపై రామ్గోపాల్ వర్మ తీస్తున్న మర్డర్ మూవీ అందరూ అనుకుంటున్నట్లు నేరుగా ఏటీటీ ప్లాట్ఫామ్పై విడుదల కావట్లేదు. థియేటర్లు తెరుచుకున్నాక వాటిలోనే విడుదల చేస్తారంట. ఈ విషయాన్ని మర్డర్కు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న నట్టి కరుణ, నట్టి క్రాంతి (నిర్మాత నట్టి కుమార్ పిల్లలు) మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ చిత్రంలోని "పిల్లల్ని ప్రేమించడం తప్పా?.." అంటూ సాగే పాటను విడుదల చేసిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. వర్మ ఆస్థాన గేయరచయిత సిరాశ్రీ రాసిన ఈ పాటను ఆర్జీవీ స్వయంగా తన బొంగురు గొంతుతో ఆలపించడం గమనార్హం. పాట చివరలో "ఇంత చెప్పినా నువ్వెవడివిరా నాన్న అంటే చంపటమో, చంపించటమో తప్పా?" అని ప్రశ్నించారు. డీఎస్ఆర్ సంగీతం సమకూర్చగా, జగదీశ్ చీకటి సినిమాటోగ్రాఫీ అందించారు.
ఆనంద్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో తండ్రీ కూతుళ్లుగా ప్రధాన పాత్రలను శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి పోషించారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా తొలి ట్రైలర్ గత మంగళవారం విడుదలై నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉందని నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి తెలిపారు. దాదాపు 70 లక్షల మంది ఈ ట్రైలర్ ను చూశారని, ఒక ఫ్యామిలీ చిత్రంలా ఎంతో బావుందన్న ప్రశంసలు ప్రేక్షకుల నుంచి లభించాయని వారు వెల్లడించారు. త్వరలో మరో ట్రైలర్ ను, రెండో పాటను విడుదల చేస్తామని వారు తెలిపారు. దాదాపు రెండు గంటల వ్యవధి గల ఈ సినిమాను థియేటర్లలు ఓపెన్ చేసిన తర్వాత విడుదల చేస్తామని వారు వివరించారు. ఆగస్ట్ నెలలో సినిమా తొలికాపీ సిద్ధమవుతుందనీ, అదే నెలలో సెన్సార్ కు పంపుతామనీ తెలిపారు.
Also Read