మెగాస్టార్కు హ్యాండిచ్చిన రేఖ!
on Nov 26, 2019
పదేళ్ల నుంచీ దేశంలోని ఐదు భాషలకు చెందిన తారలు 'ఎయిటీస్ క్లబ్' పేరుతో ఏడాదికోసారి కలుస్తూ, తాము కలిసి పనిచేసిన రోజుల ఊసులు చెప్పుకుంటూ సరదాగా గడుపుతూ వస్తుండటం మనం చూస్తున్నాం. వాళ్లంతా 1980ల కాలంలో తారలుగా గుర్తింపుకు నోచుకున్నవారే. ఈసారి పదో గెట్టుగెదర్ కావడంతో తన ఇంట్లో ఆ వేడుకను ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. నవంబర్ 24 ఆదివారం ఆ తారలకు ఆతిథ్యం ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్ర రంగాలకు చెందిన దాదాపు 40 మంది స్టార్లు ఈ వేడుకకు హాజరయ్యారు. వారిలో మోహన్లాల్, నాగార్జున, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు, ప్రభు, శరత్కుమార్, నరేశ్, సుమన్, భానుచందర్, రెహమాన్, భాగ్యరాజ్, జయరాం, సురేశ్, రమేశ్ అరవింద్ వంటి మేల్ స్టార్స్, జయసుధ, జయప్రద, సుమలత, సుహాసిని, రాధ, రాధిక, శోభన, అమల, నదియా, పూనం ధిల్లాన్, రేవతి, అంబిక, ఖుష్బూ, సరిత, లిజి, స్వప్న, పూర్ణిమా భాగ్యరాజ్, మేనక వంటి ఫిమేల్ స్టార్స్ హాజరయ్యారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారీ వారు డ్రస్ కోడ్ పాటించారు. పదో రీయూనియన్ పార్టీకి స్టార్లంతా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ డ్రస్సుల్లో హాజరయ్యారు. మెగాస్టార్ ఆతిథ్యానికి వాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఫిమేల్ స్టార్స్ సరదాగా డాన్సులు వేశారు. చిరంజీవి సరసన నాయికలుగా నటించిన వాళ్లు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ డాన్సులు చేసి, మిగతా స్టార్లకు కనువిందు చేశారని సమాచారం. కాగా బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి వంటి దక్షిణాది టాప్ స్టార్లు ఈ పార్టీకి హాజరు కాలేదు. వీళ్లతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఈ వేడుకకు రాకపోవడం గమనార్హం. ఆ అతిథి.. ఇటీవలే అక్కినేని నాగేశ్వరరావు అవార్డు అందుకున్న రేఖ. అవును. ఆమెను తమ పార్టీకి స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించాననీ, ఆమె వస్తుందో, రాదో చూడాలనీ స్వయంగా ఆ అవార్డు ప్రదానోత్సవంలోనే చిరంజీవి వెల్లడించారు. అక్కినేని అవార్డును తన చేతులతోనే ఆయన రేఖకు అందించారు. ఆరోజు జరిగిన కార్యక్రమంలో రేఖను చిరంజీవి ఏ రీతిలో పొగడ్తల జల్లులో ముంచెత్తారో మనం చూశాం. "స్టాండింగ్ బ్యూటీ, ఏజ్లెస్ బ్యూటీ, టైంలెస్ గ్లామర్" అంటూ ఆమెను ఆకాశానికెత్తేశారు మెగాస్టార్. "ఎయిటీస్ క్లబ్ గెట్టుగెదర్ను ఈసారి మా ఇంట్లో చేసుకుందామని ప్లాన్ చేసి, రేఖ గారిని దానికి స్పెషల్ గెస్టుగా రావాలని, వస్తే స్పెషల్ ఎట్రాక్షన్ అవుతారని రేఖ గారికి ఫోన్ చేసి అడిగాను. ఆమె రావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. వస్తారో, రారో చూడాలి" అని ఆయన బహిరంగంగా చెప్పారు.
అలా అందరి ముందూ రేఖను తాను ఇన్వైట్ చేసిన విషయం చెప్పాల్సిన పనిలేదు. కానీ అలా చెబితేనన్నా ఆమె తమ రీయూనియన్ పార్టీకి వస్తుందని చిరంజీవి భావించినట్లు ఊహించవచ్చు. కానీ ఏఎన్నార్ అవార్డ్ తీసుకోడానికి హైదరాబాద్కు వచ్చిన రేఖ, అదే హైదరాబాద్లో వారం రోజుల తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీకి మాత్రం డుమ్మా కొట్టేశారు. అంటే, చిరంజీవి ఆహ్వానాన్ని ఆమె మన్నించలేదు. అలా రాకపోవడానికి ఆమె కారణాలు ఆమెకు ఉండవచ్చు. అయితే, పబ్లిగ్గా తాను రేఖను తమ పార్టీకి ఆహ్వానించానని చిరంజీవి చెప్పడంతో దానికి ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు ఆ పార్టీకి చిరంజీవి పిలిచినా రేఖ రాలేదనే విషయం ప్రపంచానికి తెలిసింది. అదేగనుక చిరంజీవి ఆ విషయం బయటకు చెప్పకపోతే, రేఖను ఆయన పిలిచిన విషయం కానీ, ఆయన పిలిచినా ఆమె రాలేదనే విషయం గానీ బయటివాళ్లకెవరకూ తెలుసుండేది కాదు. సాధారణంగా ఆమె పార్టీలకు అటెండ్ కారు. అదే తరహాలో చిరంజీవి ఇంట్లో జరిగిన స్టార్ల పార్టీకీ రాలేదు.
Also Read