వర్మకు రెడ్డి జేఏసీ వార్నింగ్
on Oct 14, 2020
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగిన 'దిశ' హత్యాచార ఘటన ఎంత సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. మరోసారి మహిళల రక్షణపై ప్రజలందరూ ఆలోచనలో పడేలా చేసింది. ఘాతుకానికి పాల్పడిన దోషులు పోలీసుల ఎన్కౌంటర్ లో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్కౌంటర్' సినిమా తీశారు. కుమార్తెను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో మేమంటే, మా బాధపై సినిమా తీయడం ఏమిటని దిశా తండ్రి ప్రశ్నించారు. ఈ సినిమాపై ఆల్ ఇండియా రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
తెలంగాణలోని సెన్సార్ బోర్డుకు రెడ్డి జేఏసీ ఈ సినిమా విషయమై ఒక మెమోరాండం సమర్పించింది. 'దిశ' చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని కోరింది. వర్మ 'దిశ' ట్రైలర్ విడుదల చేయడంపైనా రెడ్డి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ సినిమాను ఆపకపోతే వర్మపై భౌతిక దాడులకు పాల్పడతామని వార్నింగులు ఇస్తోంది. గతంలో ఇతర కులాల ఆగ్రహానికి గురైన వర్మ, రెడ్డి కులస్తుల ఆగ్రహాన్ని చవి చూస్తుండటం ఇదే మొదటిసారి.