స్టార్ డైరెక్టర్ వినాయక్ కొత్త హీరోతో 'అల్లుడు శీను'ను ఎందుకు తీశాడు?
on Sep 21, 2020
మాస్ సినిమాల డైరెక్టర్ వి.వి. వినాయక్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్ కుమారుడు సాయిశ్రీనివాస్ హీరోగా ఇంట్రడ్యూస్ ఇయిన 'అల్లుడు శీను' సినిమాని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకోవడం అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్. 2013లో రామ్చరణ్ హీరోగా ఆయన రూపొందించిన 'నాయక్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్టయింది. దాని తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం ఉన్నప్పటికీ 'అల్లుడు శీను'తో సాయిశ్రీనివాస్ను ఇంట్రడ్యూస్ చెయ్యడానికే ఆయన మొగ్గుచూపాడు.
"నా శ్రేయోభిలాషులు కొంతమంది 'ఎందుకు వినయ్.. ఇప్పుడు నీకు ఈ సినిమా అవసరమా?' అన్నారు. ఈ విషయం బెల్లంకొండ సురేశ్కూ తెలుసు. కానీ నేనిప్పుడు ఈ సినిమా చెయ్యడం నా ధర్మం. ధర్మం ఎప్పుడూ ఓడిపోలేదు" అని వినాయక్ ఆ రోజు చెప్పాడు. ధర్మం అనే మాట ఆయన ఎందుకు వాడాడంటే అసలు వినాయక్ను డైరెక్టర్గా పరిచయం చేసింది బెల్లంకొండ సురేశ్ కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆది' మూవీతో వినాయక్ డైరెక్టర్ అయ్యాడు. దాన్ని బెల్లంకొండ ప్రొడ్యూస్ చేశారు.
తన కొడుకు సాయిశ్రీనివాస్ను హీరోగా పరిచయం చెయ్యాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నప్పుడు డైరెక్టర్గా ఆయన మనసులో మెదిలిన ఒకే ఒక ఆప్షన్ వినాయక్. "సాయిని నువ్వు హీరోగా పరిచయం చెయ్యాలి వినయ్" అని ఆయన అడిగారు. చేస్తానని మాటిచ్చాడు వినాయక్. ఒక బాధ్యతతో 'అల్లుడు శీను'గా అతడిని తెరమీద ప్రెజెంట్ చేశాడు. ఆ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్. కానీ స్టార్ హీరోల సినిమాలకు వచ్చే స్థాయిలో రూ. 40 కోట్ల దాకా ఆ సినిమా వసూలు చేసిందంటే చిన్న విషయం కాదు.
సాయిశ్రీనివాస్తో వినాయక్ డాన్సులు, ఫైట్లు చేయించాడు. కామెడీ, సెంటిమెంట్ సీన్లు చేయించాడు. బ్రహ్మానందం, ప్రకాష్రాజ్ లాంటి టాప్ యాక్టర్లతో కలిసి నటించిన సాయి మెప్పించాడంటే అది చిన్న విషయం కాదు. ఆ విషయంలో తన వంతు బాధ్యతను, ధర్మాన్ని నిర్వర్తించి స్నేహానికి నిజమైన అర్థం చెప్పాడు వినాయక్. ఆరేళ్ల క్రితం ఆయన పరిచయం చేసిన సాయిశ్రీనివాస్ వన్ ఫిల్మ్ వండర్లా మిగిలిపోలేదు. తనకంటూ మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. నటనలో తనదైన శైలిని ఏర్పరచుకున్నాడు. ప్రామిసింగ్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు.
Also Read