'క్రాక్' డైరెక్ట్ ఓటీటీ రిలీజ్కు ఓకే చెప్పిన రవితేజ!
on Jul 13, 2020
ఇప్పటి దాకా టాలీవుడ్లో చిన్న సినిమాలే ఓటీటీలో విడుదలవుతూ వస్తున్నాయి. అమృతా రామమ్, కృష్ణ అండ్ హిజ్ లీల, 47 డేస్, భానుమతి రామకృష్ణ సినిమాలు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్పై రిలీజవడం చూశాం. ఇప్పుడు ఓ క్రేజీ సినిమా ఓటీటీలో నేరుగా రిలీజవనుందనే ప్రచారం ఫిల్మ్నగర్లో జోరుగా నడుస్తోంది. ఆ సినిమా.. రవితేజ, శ్రుతి హాసన్ జంటగా నటించిన 'క్రాక్'. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ఆడియెన్స్లోనే కాకుండా బిజినెస్ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. రవితేజ మునుపటి సినిమాలు సరిగా ఆడకపోయినా, గోపీచంద్తో ఆయన చేసిన సినిమాలు 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు బాగానే ఆడాయి.
ఈ నేపథ్యంలో వాళ్ల కాంబినేషన్ లేటెస్ట్ మూవీ 'క్రాక్' కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మామూలు పరిస్థితులు ఉన్నట్లయితే మే నెలలోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చి ఉండేది. అయితే ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తుండటం, ఓపెన్ చేసినా కరోనా భయంతో జనం థియేటర్లకు రారేమోననే అనుమానాలతో నిర్మాతలు ఓటీటీలో నేరుగా సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అక్షయ్కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైతం తన లేటెస్ట్ ఫిల్మ్ 'లక్ష్మీ బాంబ్'ను హాట్స్టార్లో డైరెక్ట్గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండటంతో.. ఆ ప్రేరణతో 'క్రాక్'ను ఓటీటీలో రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలకు ఇప్పటికే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం ఒక పెద్ద స్ట్రీమింగ్ సైట్తో వాళ్లు చర్చలు జరుపుతున్నారు. ఆశించిన రేటు గనుక వచ్చేట్లయితే ఆ సైట్కు అమ్మడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ చర్చలు ఫలించినట్లయితే ఓటీటీలో డైరెక్ట్గా రిలీజయ్యే తొలి భారీ సినిమాగా 'క్రాక్' నిలవనున్నది. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.