'బిగ్ బాస్ 3' ఫేమ్... టీవీ యాక్టర్కీ కరోనా
on Jul 4, 2020
చాప కింద నీరులా... తాబేలు నడకలా... నెమ్మదిగా టీవీ ఇండస్ట్రీలో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటికి ముగ్గురు స్టార్ యాక్టర్స్ కొవిడ్19 బారిన పడగా... తాజాగా మరో కేసు నమోదు అయింది. మొదట 'మట్టిగాజులు', 'సూర్యకాంతం' సీరియల్స్ చేస్తున్న నటుడు ప్రభాకర్ కి కరోనా వచ్చింది. తరవాత ఆయనతో కాంటాక్ట్ అయిన మరో నటుడు హరికృష్ణ సైతం కొవిడ్19 పాజిటివ్ గా తేలారు. వీళ్ళిద్దరూ కాకుండా టీవీ నటి నవ్య స్వామి తనకు కరోనా వచ్చిందని ప్రకటించారు. లేటెస్టుగా ఈ లిస్టులోకి 'బిగ్ బాస్ 3' ఫేమ్, టీవీ యాక్టర్ రవికృష్ణ చేరారు.
ఇన్స్టాగ్రామ్లో రవికృష్ణ ఒక పోస్ట్ చేశారు. అందులో తనకు కరోనా వచ్చినట్టు పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లు ఐసోలేషన్ లోకి వెళ్ళమనీ, కరోనా టెస్టులు చేయించుకోమని ఆయన కోరారు. ఈ మహమ్మారి బారిన పడినవాళ్లను తక్కువ చేసి చూడవద్దని రవికృష్ణ కోరారు. ఇటీవల శిల్పారెడ్డి, నవ్య స్వామి సైతం తమకు కరోనా సోకినా విషయాన్నీ ధైర్యంగా చెప్పిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ సైతం కరోనా నుండి కోలుకున్న విషయాన్ని వెల్లడించారు.
రవికృష్ణ, నవ్య స్వామి కలిసి జంటగా 'ఆమె కథ' సీరియల్లో నటిస్తుండటం గమనార్హం. తాజా పరిణామాలతో ఇంకెంతమంది టీవీ సెలబ్రిటీలు, ఇతర సిబ్బంది కొవిడ్-19 బారిన పడ్డారోననే ఆందోళన వ్యక్తమవుతోంది.