మరోసారి అల.. మెగా కాంపౌండ్లో!
on Dec 4, 2020
స్వల్ప కాలంలోనే సెన్సేషనల్ స్టార్గా టాలీవుడ్లో అవతరించిన రష్మిక మందన్న.. నంబర్ వన్ హీరోయిన్గా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. మొదట నాగశౌర్య సరసన నటించిన 'ఛలోలో నాయికగా ఆకట్టుకొని, ఆ తర్వాత విజయ్ దేవరకొండ జోడీగా 'గీత గోవిందం' చిత్రంతో సంచలన తారగా మారింది రష్మిక. సూపర్స్టార్ మహేశ్ సరసన చేసిన 'సరిలేరు నీకెవ్వరు' మూవీ బ్లాక్బస్టర్ అవడంతో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. నితిన్తో చేసిన 'భీష్మ' సినిమా విజయం ఆమె స్థానాన్ని మరింత పదిలం చేసింది.
ఆపైన తొలిసారి మెగా కాంపౌండ్లో 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నాయికగా నటిస్తుండటం ద్వారా అడుగుపెట్టింది. లేటెస్ట్ బజ్ ప్రకారం మరో మెగా హీరో సరసన నటించే ఛాన్స్ ఆమె దక్కించుకుంది. అది 'ఆచార్య' మూవీలో రామ్చరణ్ జోడీగా. కొద్ది రోజులుగా స్పెక్యులేషన్గానే ఉన్న ఈ ప్రచారం నిజం కాబోతున్నట్లు ఇన్సైడర్స్ చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న 'ఆచార్య' చిత్రంలో ఆయనకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.
ఇందులో ఓ అరగంట సేపు కనిపించే కీలక పాత్రను రామ్చరణ్ చేస్తున్నాడు. అతనికి జోడీ కోసం కొంత కాలంగా డైరెక్టర్ కొరటాల శివ అన్వేషిస్తున్నాడు. మొదట కియారా అద్వానీని తీసుకోవాలని ప్రయత్నించారు. అయితే ఆమె బాలీవుడ్లో తీరిక లేనంత బిజీగా ఉండటంతో, చివరకు రష్మిక వైపు మొగ్గు చూపాడు కొరటాల. ఇప్పటికే రష్మిక సైతం ఆ క్యారెక్టర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. అల.. మరోసారి మెగా కాంపౌండ్లో చాన్స్ సంపాదించింది ఈ 'డియర్ కామ్రేడ్' తార.
Also Read