సమంత ఛాలెంజ్.. సై అన్న రష్మిక!
on Jul 16, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత ప్రోగ్రామ్లో భాగంగా ఇటీవల సీనియర్ స్టార్ నాగార్జున మొక్కలు నాటారు. తన కోడలు సమంతకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. దాన్ని స్వీకరించిన సమంత సైతం మొక్కలు నాటి కొంతమందిని ఛాలెంజ్ చేశారు. వారిలో సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక కూడా ఉంది. ఆ ఛాలెంజ్ను స్వీకరించిన రష్మిక తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
మొక్కలు నాటి చేతులకు అంటిన మట్టిని చూపిస్తూ కళ్లు మూసుకొని ఉన్న ఫొటోను షేర్ చేసి, "నన్ను నామినేట్ చేసినందుకు సమంతకు థాంక్స్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను నేను స్వీకరించాను. ఇబ్బందికరమైన ముఖం లేకుండా ఫొటో తీసుకోవడానికి చేసిన స్ట్రగుల్ నిజమైంది" అంటూ రాసుకొచ్చింది రష్మిక. తన వంతుగా మరో ముగ్గురిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు నామినేట్ చేసింది. ఆ ముగ్గురు.. రాశీ ఖన్నా, కల్యాణీ ప్రియదర్శన్, ఆషికా రంగనాథ్ (కన్నడ నటి). తన ఫ్యాన్స్ కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరించి, ఒక్కొక్కరు మూడేసి మొక్కలు నాటి ఈ చైన్ను కొనసాగించాలని రష్మిక పిలుపు ఇచ్చింది.