త్వరలో వాళ్ళ మీద కేసు పెడతా - రావు రమేష్
on May 30, 2020
‘‘నన్ను, నా నటనను అభిమానించే ప్రతిఒక్కరికీ చెప్పేది ఏంటంటే... నాకు సోషల్ మీడియాలో ఎటువంటి అకౌంట్స్ లేవు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్... వేటిలోనూ నేను లేను’’ అని నటుడు రావు రమేష్ తెలిపారు. ఆయన నుండి ఈ ప్రకటన రావడానికి కారణం... ట్విట్టర్లో ఫేక్ అకౌంట్. ఎవరో రావు రమేష్ పేరు మీద ట్విట్టర్లో అకౌంట్ ఓపెన్ చేశారు. రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అందువల్ల, రావు రమేష్ వివరణ ఇచ్చారు. ‘‘నా పేరు మీద ఎవరో ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు. వాటికి, నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఆ పోస్టులకు, ఆ ట్విట్టర్ అకౌంట్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి వాటిని నమ్మకండి. నా అభిప్రాయాలను నేనే పత్రికా ముఖంగా తెలియజేస్తా. నా పేరు మీద ఇటువంటివి చేస్తున్న వారిపై త్వరలో కంప్లయింట్ ఇవ్వబోతున్నా’’ అని రావు రమేష్ తెలిపారు.
ఇప్పుడు ప్రజలందరూ సోషల్ మీడియా జమనాలో ఉన్నారు. ప్రముఖులు సైతం! గతంలో ప్రముఖులు ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రజలకు చేరువ కావాలంటే విలేకరుల సమావేశం నిర్వహించేవారు. ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్, ఫేస్బుక్లో పోస్ట్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే చాలు. అవి చూడనివాళ్లకు సైతం చేరవేసే బాధ్యతను పత్రికలు, వెబ్సైట్లు, టీవీ ఛానల్స్ తీసుకున్నాయి. అందుకని, మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. సోషల్ మీడియాతో అప్పుడప్పుడూ స్టార్స్కి ఇటువంటి లేనిపోని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి.
Also Read