విచారణలో దీపికతో ఉండడానికి అనుమతి ఇవ్వండి!
on Sep 25, 2020
డ్రగ్స్ కేసులో దీపికా పడుకోనేకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఆమెను విచారణకు రమ్మని ఆదేశించారు. దాంతో గోవాలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న దీపిక.. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని గురువారం రాత్రి ముంబై వచ్చారు. ఆమె వెంట భర్త రణ్వీర్ సింగ్ కూడా ఉన్నారు.
ఎన్సీబీ విచారణకు శనివారం దీపిక హాజరు అవ్వనుండగా... దానికి ముందు ఎన్సీబీకి రణ్వీర్ సింగ్ ఒక అభ్యర్ధన చేశారు. దీపికకు యాంగ్జైటీ సమస్యలు ఉన్నాయని, ఒక్కోసారి ఆమె ఉన్నపళంగా భయాందోళనలకు గురి అవుతుందని, అందువల్ల భార్యతో ఉండటానికి అనుమతి ఇవ్వమని రణ్వీర్ సింగ్ ఎన్సీబీని రిక్వెస్ట్ చేశారు. తాను భారతీయ న్యాయవ్యవస్థ, చట్టాలను గౌరవించే వ్యక్తినని... ఆమెను ప్రశ్నించే సమయంలో, విచారణలో తాను ఉండకూడదని తెలుసునని... కాకపోతే పరిస్థితి అర్థం చేసుకోమని ఎన్సీబీకి అతడు విజ్ఞప్తి చేశాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
దీపికా పడుకోనేతో సహా రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాకపూర్, సారా అలీ ఖాన్ సమన్లు అందుకున్నారు. తల్లితో కలిసి గోవా వెళ్లిన సారా కూడా గురువారం రాత్రి ముంబై చేరుకున్నారు. నేడు ఎన్సీబీ విచారణకు రకుల్ హాజరు అయ్యారు.