రానా-గుణశేఖర్ 'హిరణ్యకశ్యప' ఉందా? ఆగిందా?
on Nov 12, 2019
'రుద్రమదేవి' విడుదలై నాలుగేళ్లు అవుతోంది. ఓరుగల్లు వీరవనిత చరిత్రను తెరపై చూపించిన తర్వాత, దర్శకుడు గుణశేఖర్ నుండి మరో సినిమా రాలేదు. రానాతో 'హిరణ్యకశ్యప' ప్రకటించారు. కానీ, ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు, ఈ సినిమా ఉందా? ఆగిందా? అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వీటికి రానా ఫుల్ స్టాప్ పెట్టారు. "గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' చేస్తున్నాను. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మా స్టూడియోలో జరుగుతున్నాయి. షూటింగ్ కోసం కొన్ని సెట్స్ కూడా వేస్తున్నాం. కావాలంటే వచ్చి చూడండి. ఏ సినిమాకైనా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్. అది సరిగ్గా చేస్తే షూటింగ్ డేస్ తగ్గుతాయి. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' షూటింగ్ 70 రోజుల్లో పూర్తి చేశారని తెలిసి ఆశ్చర్యపోయా. మనం నెలల తరబడి షూటింగులు చేయాల్సిన అవసరం లేదు. ప్రీ ప్రొడక్షన్ పక్కాగా చేస్తే తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేయవచ్చు" అన్నారు.
ఈమధ్య కాలంలో రానా ఆరోగ్యంపై చాలా పుకార్లు వచ్చాయి. ఎప్పటికప్పుడు వాటిని రానా ఖండిస్తూ వచ్చారు. అమెరికాలో కొన్ని నెలలు ఉండి, ఇటీవల ఇండియా వచ్చారు. గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఓపెనింగులో ఆదివారం సందడి చేశారు. మరి, రానా చేస్తున్న సినిమాల సంగతేంటి? తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానున్న 'హాథీ మేరే సాతి' షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్తున్నాడు. 'నీదీ నాదీ ఒకే కథ' ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' షూటింగులో డిసెంబర్ నుండి జాయిన్ కానున్నాడు. అలాగే, రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు రానా కన్ఫర్మ్ చేశాడు. జనవరి నుండి ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది.