యాభయ్యేళ్ల రమ్యకృష్ణ.. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బర్త్డే జరుపుకున్న శివగామి!
on Sep 15, 2020
టాలీవుడ్లోని అత్యంత ప్రతిభావంతులైన తారల్లో రమ్యకృష్ణ ఒకరు. మూడు దశాబ్దాలకు మించిన కెరీర్లో అనేక రకాల పాత్రలు పోషించి, ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశారు. గ్లామరస్ రోల్స్, విమెన్ సెంట్రిక్ రోల్స్, కామెడీ రోల్స్, ఎమోషనల్ రోల్స్, పవర్ఫుల్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్.. ఇలా భిన్న పాత్రలలో రాణించి, రమ్యకృష్ణ ఉన్నతస్థాయి నటి అనే పేరు తెచ్చుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఆమె టాలీవుడ్లోని టాప్ హీరోయిన్స్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.
రజనీకాంత్ 'నరసింహా' సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర ఆమెకు తెచ్చిన పేరు సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవచ్చు. రజనీతో ఢీ అంటే ఢీ అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో అమోఘంగా రాణించారు రమ్య. ఇటీవల 'బాహుబలి' మూవీలో శివగామిగా చేసిన పర్ఫార్మెన్స్తో ఆమె దేశవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నారో తెలిసిందే.
అలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ సెప్టెంబర్ 15న 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. 1970లో ఇదే రోజున ఆమె జన్మించారు. అర్ధరాత్రి దాటాక సెప్టెంబర్ 15వ తేదీ ఎంటరవగానే కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి వారితో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. భర్త కృష్ణవంశీ, కుమారుడు రిత్విక్ వంశీ, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన పిక్చర్ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసుకున్నారు రమ్య. "Fifty and fabulous n what better than a FAMJAM to bring it on!!!!" అంటూ దానికి క్యాప్షన్ రాశారు. దానికి ఫ్యామిలీ లవ్ అనే హ్యాష్ట్యాగ్ జోడించారు.