సీఎం జగన్పై వర్మ సెటైర్!?
on May 27, 2020
కరోనా వైరస్ వచ్చిన కొత్తల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘తెలంగాణ’ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ‘ఆంధ్రప్రదేశ్’ వైయస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకోలేదు. కేసీఆర్గారు ‘జస్ట్ పారాసిట్మాల్ వేసుకుంటే చాలు’ అన్నారు. ‘బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు’ అని జగన్గారు చెప్పారు. ఇప్పుడీ రెండు డైలాగులను ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో వినవచ్చు. గత డైలాగులను గుర్తు చేసి, వాళ్ల తెలియనితనం బయటపెట్టడంతో పాటు ఒక రకంగా వాళ్లపై రామ్గోపాల్ వర్మ సెటైర్ వేశారని చెప్పవచ్చు.
అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం ‘కరోనా వైరస్’. ప్రపంచంలో కరోనాపై తొలి చిత్రం తమదే అని చెబుతున్నారు. అదెంత నిజమనేది పక్కన పెడితే... లాక్డౌన్లో షూటింగ్ చేసిన తొలి సినిమాగా ఇది రికార్డులకు ఎక్కింది. ఆల్రెడీ ట్రైలర్ విడుదల చేశారు. లాక్డౌన్లో ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఒకరికి కరోనా వస్తే ఏంటనేది కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కెమెరా యాంగిల్స్, యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే వర్మ శైలిలో అగస్త్య మంజు సినిమా తెరకెక్కించాడని తెలుస్తోంది. ట్రైలర్ అంతా ఒకెత్తు, ట్రైలర్ చివర్లో కేసీఆర్, జగన్ డైలాగులు మరో ఎత్తు.
రామ్గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని గిల్లుతారో తెలియదు. నిన్న పొగిడిన వ్యక్తిని ఈ రోజు తిట్టొచ్చు. లేదంటే తిట్టినవాణ్ణి ఆకాశానికి ఎత్తేయొచ్చు. ఇప్పుడదే జరిగింది. గతంలో జగన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇలా సెటైర్ వేశారు. రేపు ఆయనకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వర్మ చర్యలు ఊహాతీతం.