రకుల్ యుద్ధానికి వెళ్లినట్టు ఫీలైన వేళ...
on Mar 23, 2020
రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని రోజుల క్రితం ఒక యాడ్ షూట్ చేశారు. అక్కడ మాస్కులు వేసుకుని తన టీమ్తో తీసుకున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ‘‘అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. ఈ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయా. కానీ, టీమ్ అంతా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆందోళన మాని తెలివిగా ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి. నవ్వుతూ కరోనా వైరస్తో పోరాడండి’’ అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
కరోనా భయపెడుతున్న వేళ షూటింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి రకుల్ మాట్లాడుతూ ‘‘ఇంటి నుండి బయటకు వెళుతుంటే... యుద్ధానికి వెళ్లినట్లు అనిపించింది. సెట్లో తప్పనిసరిగా ఒక డాక్టర్, చాలా తక్కువ మంది బృందం ఉండేలా చూసుకున్నాం. ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే... ఇప్పటి వరకూ నేను చేసిన షూటింగుల్లో కష్టమైన షూటింగ్ అదే. నా అనుచరులను తప్ప నా వ్యాన్లోకి ఎవరినీ అనుమతించలేదు’’ అన్నారు.
ప్రస్తుతం రకుల్ చేతిలో మూడు హిందీ సినిమాలు ఉన్నాయి. జాన్ అబ్రహం ‘ఎటాక్’, అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించనున్న ‘థాంక్ గాడ్’ సహా అర్జున్ కపూర్తో మరో చిత్రంలో ఆమె కథానాయిక. కరోనా కారణంగా చిత్రీకరణలు ఆగిపోవడంతో, మళ్లీ మొదలైనప్పుడు మూడు చిత్రాలకు డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలోనని రకుల్ ఇప్పట్నుంచే ఆలోచిస్తున్నారు. ‘‘అసలు మార్చిలో ప్రతిరోజూ నేను షూటింగ్ చేయాలి. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ చిత్రాలకు డేట్స్ ఇచ్చా. ఏం చేస్తాం? ఏమీ చేయలేకపోయాం. ఏప్రిల్ 10 నుండి ‘థాంక్ గాడ్’ స్టార్ట్ చేయాలి. కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఏం జరగబోతుందో అర్థం కావడం లేదు. నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద బ్రేక్ ఇదే’’ అని రకుల్ అన్నారు.
Also Read