నిజంగానే మనసున్న మారాజు!
on Nov 8, 2017
మంచి తనం ఎక్కడున్నా పరిమళిస్తుంది. దానికి ఉదాహరణ డా.రాజశేఖర్. తన కెరీర్ లో చిన్న చిన్న తప్పులు దొర్లినా... దాని వల్ల తాను నష్టపోయాడు తప్ప .. వేరొకరిని నష్టపరచిన దాఖలాల్లేవ్. అంతేకాదు... కష్టాల్లో ఉన్నవారికి పిలవకుండానే వెళ్లి సాయం చేసే గొప్ప వ్యక్తిత్వం గల మనసున్న మారాజు రాజశేఖర్. దీనికి ఒకటి కాదు చాలా ఉదంతాలున్నాయ్.
ఎన్టీయార్ చివరి రోజుల్లో ఆయనకు అండదండగా... ఓ కొడుకులా తోడు నిలిచిన వ్యక్తి డా.రాజశేఖర్. ఇది ఆ ఉదంతాన్ని దగ్గరగా చూసిన అందరికీ తెలుసు. ఆ రోజున రాజశేఖర్ ని ఎన్టీయార్ పిలవలేదు. కానీ.. ఆయనే వెళ్లాడు. చేతనైన సాయం చేశాడు. ఒక డాక్టర్ గా ఎన్టీయార్ కి తోడు నిలిచాడు.
అంతేకాదు.. అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల్లోనూ.. రాజశేఖర్ వైద్యాన్ని అందించారని టాక్. ఇక డి.రామానాయుడు ఆఖరి రోజుల్లో వైద్యాన్నందించింది డా.రాజశేఖరే.
ఇదంతా ఒకెత్తయితే... సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ బాబూరావు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న చివరి రోజుల్లో... ఆయన ఇంటికొచ్చి వైద్యం అందించడం మరో ఎత్తు. అంత పెద్ద హీరో అయ్యుండి.. ఓ సామాన్య జర్నలిస్ట్ ఇంటికొచ్చి వైద్యం అందించడం సాధారణమైన విషయమేం కాదు. రాజశేఖర్ కి కొన్నాళ్లు పర్సనల్ పి.ఆర్.ఓగా బాబూరావు పనిచేశారు. కేవలం ఆ అభిమానంతో ఓ జర్నలిస్ట్ కి వైద్యం అందించారు రాజశేఖర్.
అంతేకాదు.. కష్టాల్లో తన దగ్గరకొచ్చిన వారికి ఏదో ఒక సాయం చేయడానికి ప్రయత్నిస్తారాయన. ప్రెస్ మీట్లో మీడియా మిత్రులను కలిసినప్పుడు.. వారి ముఖాలు చూసి.. ఏదైనా తేడా అనిపిస్తే... మెడిసిన్ రాసిస్తారు. వైద్య సలహా ఇస్తారు. తను గొప్ప నటుడైనా.. తనలో ఉన్న వైద్యుడ్ని మాత్రం ఆయన పక్కన పెట్టలేదు. డబ్బు గురించి ఆలోచించకుండా ఫ్రీగా వైద్యం అందించేవారు.
రీసెంట్ గా కామెడీ హీరో సునీల్ కూడా రాజశేఖర్ వల్ల పొందిన ఓ మేలు గురించి మీడియాకు తెలియజేశాడు. తన కుమార్తె ఆరోగ్యం ఆందోళనగా ఉన్న రోజుల్లో.. రాజశేఖర్ పిలవకుండానే.. వచ్చి ఆ పాపకు వైద్యం అందించి బ్రతికించారట. ఈ విషయాన్ని సునీల్ రీసెంట్ గా జరిగిన ఓ మీడియా సమావేశంలో తేటతెల్లం చేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. మేలు పొందిన వారు సైతం.. సక్సెస్ వచ్చిన తర్వాత కానీ బయటకొచ్చి చెప్పకపోవడం. ఏదిఏమైనా.. డాక్టర్ గారు నిజంగా ‘మనసున్న మారాజు’ . ఏమంటారు?