'అంధాధున్' మలయాళం రీమేక్లో పృథ్వీరాజ్!
on Nov 28, 2020
బ్లాక్బస్టర్ హిందీ మూవీ 'అంధాధున్' తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్లో ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే చేసిన పాత్రల్ని తెలుగు రీమేక్లో నితిన్, తమన్నా, నభా నటేశ్ చేయనుండగా, తమిళ రీమేక్లో హీరోగా ప్రశాంత్ నటించనున్నాడు. తాజాగా ఈ సినిమా మలయాళం రీమేక్లో హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. టబు, రాధిక పాత్రలకు మమతా మోహన్దాస్, అహాన కృష్ణ ఎంపికయ్యారని కూడా తెలుస్తోంది. రవి కె. చంద్రన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ 'జన గణ మన' షూటింగ్లో బిజీగా ఉన్నాడు.
తమిళ వెర్షన్లో టబు క్యారెక్టర్లో నటించడానికి ఐశ్వర్యా రాయ్ను సంప్రదించినట్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. గతంలో జీన్స్లో ప్రశాంత్, ఐశ్వర్య జంటగా నటించడంతో ఆ పరిచయంతో ఆమెను అడిగారంటున్నారు. అయితే ఆమె టబు పాత్రలోకి వచ్చే అవకాశాలు లేవని మరో టాక్. ప్రశాంత్తో పాటు ఇప్పటికే కార్తీక్, యోగిబాబు ఈ మూవీలో నటించనున్నారు. 'పొన్మంగల్ వంధాల్' ఫేమ్ జె.జె. ఫ్రెడరిక్ డైరెక్ట్ చేసే ఈ తమిళ్ రీమేక్ను ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ నిర్మిస్తున్నారు.
ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసే ఈ మూవీని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది. మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.