ENGLISH | TELUGU  

ప్రభాస్.. స్టార్ ఆఫ్ ద డికేడ్!

on Dec 30, 2019

 

టాలీవుడ్‌కు సంబంధించి ఈ దశాబ్దపు స్టార్ ఎవరు? నిస్సందేహంగా ప్రభాస్! అవును. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్.. వంటి స్టార్ హీరోలెవరికీ సాధ్యం కాని పాన్-ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక స్టార్ ప్రభాస్ అని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం.. ప్రభాస్ కెరీర్‌ను 'బాహుబలి'కి ముందు, 'బాహుబలి'కి తర్వాత.. అని డివైడ్ చేసి చెప్పుకోవాలి. 

2010-19 దశాబ్దంలో ఒక స్టార్‌గా ప్రభాస్ ఎదుగుతూ వచ్చిన క్రమం అపూర్వం. ఈ కాలంలో అతడు చేసిన సినిమాలు ఏడంటే ఏడే. వీటిలో ఫ్లాపయింది ఒకే సినిమా.. అది 2012లో వచ్చిన 'రెబెల్'. కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రీకొడుకులుగా తొలిసారి కనిపించిన ఈ సినిమాని రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేశాడు. లాజిక్‌లెస్ సీన్లు, వీక్ స్క్రీన్‌ప్లేతో ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయింది. ఈ దశాబ్దాన్ని 'డార్లింగ్' వంటి హిట్‌తో మొదలుపెట్టి, అందరికీ డార్లింగ్ యాక్టర్‌గా మారాడు ప్రభాస్. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలో తన పేరున్న క్యారెక్టర్‌లో అతను నటించాడు. నందిని అనే తన చిన్ననాటి స్నేహితురాలినే మనసునిండా నింపుకున్న అతను పెద్దయ్యాక ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడనేది ఈ మూవీలోని ప్రధానాంశం. మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైనింగ్ యాక్టర్‌గా ప్రభాస్ రూపాంతరం చెందాడని నిరూపించిన సినిమా 'డార్లింగ్'. కథలో బలం లేకపోయినా సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని అతను జనాన్ని ఆకట్టుకున్నాడు.

'డార్లింగ్' వచ్చిన మరుసటి ఏడాదే అంటే 2011లో మరో రొమాంటిక్ ఫిల్మ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' చేసి, అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ప్రభాస్. దశరథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విక్కీ అనే క్యారెక్టర్‌లో విశేషంగా అతను రాణించాడు. తనను ఇష్టపడ్డ చిన్ననాటి నేస్తం ప్రియ తనకు సరిజోడు కాదని భావించి, మ్యాగీ అనే యువతి తనకు కరెక్ట్ అనుకున్న విక్కీ, ఆ తర్వాత  ప్రేమానుబంధం నిలబడాలంటే సర్దుకుపోవడం అనేది చాలా ముఖ్యమని గ్రహించి, ప్రియ దగ్గరకు వెళ్లడం ప్రేక్షకుల్ని మెప్పించింది. అదివరకెన్నడూ చెయ్యని భిన్నమైన పాత్రలో టైటిల్‌కు తగ్గట్లు పర్ఫెక్టుగా ఒదిగిపోయి ఆకట్టుకున్నాడు ప్రభాస్.

2012లో రివెంజ్ డ్రామాగా లారెన్స్ తీసిన 'రెబెల్' మూవీలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ హీరోగా కనిపించాడు ప్రభాస్. మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఆ తర్వాతి సంవత్సరం ప్రభాస్‌ను స్టార్‌గా మరింత ఎత్తుకు తీసుకెళ్లిన సినిమా వచ్చింది. అది 'మిర్చి'. అంతదాకా రైటర్‌గా ఉన్న కొరటాల శివలో డైరెక్టర్‌ను చూసి, అతనికి అవకాశమిచ్చాడు ప్రభాస్. యాక్షన్ మేళవించిన ఫ్యామిలీ డ్రామాగా తయారైన ఈ మూవీలో ప్రభాస్ సరికొత్తగా మనముందుకొచ్చాడు. ఎవరినైనా ప్రేమతో మార్చేయవచ్చనే జై క్యారెక్టర్‌లో ప్రభాస్ పండించిన కామెడీ, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్ సీన్లకు అతని ఫ్యాన్సే కాకుండా అన్నివర్గాల ప్రేక్షకులూ ఫిదా అయ్యి, ఆ సినిమాను సూపర్ హిట్ చేశారు. 2013లోనే ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా 47 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది.

ఇక ఆ తర్వాత ప్రభాస్ ఏ స్థాయికి ఎదిగాడో కళ్లముందు కదలాడుతూనే ఉంది. యస్.యస్. రాజమౌళి 'బాహుబలి'గా ప్రభాస్‌ను ఊహించుకోవడం అతని దశను పూర్తిగా మార్చేసింది. మాహిష్మతి అనే సామ్రాజ్యం కోసం దాయాదులైన బాహుబలి, భల్లాలదేవ మధ్య జరిగే పోటీతో ఆద్యంతం ఉత్కంఠభరిత కథనంతో, ఉద్వేగం నిండిన సన్నివేశాలతో రాజమౌళి తీసిన రెండు భాగాల ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల్లో ప్రభాస్ ఒదిగిన తీరుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఈ సినిమాలతో ప్రభాస్ టాలీవుడ్ స్టార్ స్థాయి నుంచి ఇండియన్ సినిమా స్టార్ స్థాయికి అనూహ్యంగా ఎదిగిపోయాడు. ఇవాళ దేశంలోని ఏకైక పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రమే అనేది నిస్సందేహం. బాలీవుడ్ స్టార్లు సైతం అసూయపడేలా అతని మార్కెట్ పరిధి అమితంగా విస్తరించింది. 'బాహుబలి' సినిమాలు రెండూ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదలై హయ్యెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిమ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. ఒక్క తెలుగు వెర్షన్ చూసుకున్నా, 2015లో విడుదలైన 'బాహుబలి: ద బిగినింగ్' వరల్డ్‌వైడ్‌గా 183 కోట్ల షేర్ సాధిస్తే, 2017లో వచ్చిన 'బాహుబలి: ద కన్‌క్లూజన్' ఏకంగా 310 కోట్ల రూపాయల్ని ఆర్జించి, మరే టాలీవుడ్ హీరోకూ అందని రేంజిలో నిలిచింది.

'బాహుబలి' సినిమాల విజయాల్ని కేవలం రాజమౌళి ఖాతాలో వేసేవాళ్ల అభిప్రాయం తప్పని నిరూపించింది, వాటి తర్వాత ఈ ఏడాది వచ్చిన 'సాహో' మూవీ. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ సినిమా బిజినెస్ అయిన తీరే దానికి నిదర్శనం. రెండు గ్యాంగ్‌స్టర్ ముఠాల మధ్య ఆధిపత్య పోరుతో తీసిన ఈ సినిమాలో అండర్‌కవర్ కాప్ అశోక్‌గా ప్రభాస్ ఎంత బాగా చేసినా, డైరెక్టర్ సుజిత్ కథ మీద ధ్యాస పెట్టకుండా, యాక్షన్ ఎపిసోడ్స్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో ఆశించిన రీతిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది తెలుగు వెర్షన్. అయినప్పటికీ 108 కోట్ల రూపాయల షేర్ సాధించిందంటే, అది ప్రభాస్ కరిష్మా ప్రభావమే. అన్ని వెర్షన్లు కలిపి 276 కోట్ల ప్రి బిజినెస్ చేసిన 'సాహో' 210 కోట్లను ఆర్జించగలిగింది. హిందీ వెర్షన్ మాత్రం ప్రాఫిట్స్‌ను అందుకోవడం విశేషం. నెగటివ్ టాక్‌లోనూ 'సాహో' ఈ స్థాయి వసూళ్లను అందుకోవడంతో అందరూ ముక్తకంఠంతో ప్రభాస్‌ను ఏకైక పాన్-ఇండియా స్టార్‌గా అంగీకరించారు. ఏదేమైనా  టాలీవుడ్‌లో 2010-19 దశాబ్దం తనదేనని, ఈ దశాబ్దపు స్టార్‌ని తానేనని తన సినిమాలతోటే తెలియజేశాడు ప్రభాస్.

ఇప్పుడు ప్రభాస్ 'జాన్' అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీకి 'జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్ డైరెక్టర్. కొత్త దశాబ్దం తొలి ఏడాది.. అంటే 2020 సమ్మర్‌లో వచ్చే ఈ మూవీపై ఇప్పటికే బయ్యర్లు భారీగా డబ్బు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న దశాబ్దంలో ప్రభాస్‌కు పోటీనిచ్చే టాలీవుడ్ స్టార్ ఎవరో చూడాల్సిందే.

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.