దాతృత్వంలోనూ 'బాహుబలి': ప్రభాస్ విరాళం రూ. 4 కోట్లు!
on Mar 27, 2020
'బాహుబలి' ప్రభాస్ దానం చేయడంలోనూ తాను బాహుబలినేనని నిరూపించుకున్నాడు. గురువారం మొదట ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు కలిపి రూ. కోటి విరాళం ప్రకటించిన ఆయన రాత్రి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఏకంగా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించాడు. వెరసి.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల నిమిత్తం ప్రభాస్ ప్రకటించిన విరాళం 4 కోట్లు. ఇటీవల తన 20వ సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లి, అర్ధంతరంగా తిరిగొచ్చిన ప్రభాస్, రాగానే 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లాడు.
గురువారం పవన్ కల్యాణ్, చిరంజీవి, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ వంటి స్టార్లు కోవిడ్-19పై పోరాటానికి విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటగా పవన్ కల్యాణ్ ఈ మంచి పని కోసం రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించగా, చిరంజీవి, మహేశ్ చెరొక రూ. 1 కోటి, తారక్ రూ. 75 లక్షలు, రామ్చరణ్ రూ. 70 లక్షలు విరాళం ప్రకటించారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫెఫ్సీ వర్కర్ల సహాయం కోసం రూ. 50 లక్షల విరాళం అందజేశారు. అయితే ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్పై పోరాటానికి అత్యధిక విరాళం రూ. 4 కోట్లు ప్రకటించిన ఏకైక ఫిల్మ్ స్టార్ ప్రభాస్!