పవన్ రాస్తున్నాడా?? రాయిస్తున్నాడా??
on Sep 14, 2016
పవన్ కల్యాణ్ ఇప్పుడో పుస్తకం రాయబోతున్నాడు.. నేను - జనం - మనం అని మంచి టైటిల్ కూడా పెట్టాడు. మార్పు కోసం యుద్దం అంటూ సినిమా లెవిల్లో క్యాప్షన్ జోడించాడు. పవన్ నుంచి పుస్తకం వస్తోందంటే అది ఆసక్తిని రేకెత్తించే అంశమే. అయితే పవన్లో పుస్తకం రాసేంత టాలెంట్ ఉందా?? అనేది ఆయన్ని విమర్శించేవాళ్లు చెబుతున్నమాట. పవన్ ఇది వరకు ఇజం అనే బుక్ రాశాడు. అందులో తన భావాలే ఉన్నా... రాసింది మాత్రం రాజా రవితేజ అనే మరో మిత్రుడు. ఇప్పుడు రాజా రవితేజా ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఆ పుస్తకానికి వచ్చిన ఆదరణ కూడా అంతంత మాత్రమే. పైగా అది ఇంగ్లీష్ భాషలో ఉండడంతో పవన్ అభిమానులకు చేరువ కాలేకపోయింది.
అందుకే ఇప్పుడు తెలుగులో రాయడానికి ఉపక్రమించాడు పవన్. అయితే ఈసారీ పవన్ చేయి చేసుకోవడం లేదని మరెవరితోనూ రాయిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. పవన్ స్పీచ్లు కూడా బయటి నుంచే వస్తాయని, తన మిత్రుడు త్రివిక్రమ్ రాసి ఇస్తుంటాడని చెప్తుంటారు. ఈసారీ... ఈ పుస్తకం త్రివిక్రమే రాస్తున్నాడేమో? మరోవైపు పవన్ సన్నిహితులు మాత్రం.... పవన్ స్వయంగా పుస్తకం రాస్తున్నాడని, ఇప్పుడు కాదు, ఎప్పుడో రాయడం మొదలెట్టాడని చెబుతున్నారు. అవునా, కాదా అనేది తెలియాలంటే ఆ పుస్తకం వచ్చేంత వరకూ, తీసి చదివేంత వరకూ... ఆగాల్సిందే.