కరోనాపై పోరాటం: పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల విరాళం
on Mar 26, 2020
జనసేన పార్టీ అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా వైరస్పై పోరాటానికి రెండు కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్, వ్యాధిపై పోరు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈమొత్తాన్ని అందజేస్తున్నట్టు తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి సహాయనిధికి మరో కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా విపత్తు నుండి మన దేశాన్ని బయటపడేస్తుందని పవన్ పేర్కొన్నారు. దేశంలో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ.20 లక్షలు విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు ఇవ్వనున్నారు.
కరోనా విముక్త భారతావని సాధించినప్పుడే నిజమైన ఉగాది అని బుధవారం పేర్కొన్న పవన్... కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. పెను విపత్తులు సంభవించినప్పుడు ఈ విధంగా భారీ మొత్తంలో పవన్ విరాళం ఇవ్వడం ఇదేమీ తొలిసారి కాదు. ఇప్పటికి చాలాసార్లు ఇచ్చారు. మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విరాళం ఇచ్చిన తొలి హీరో నితిన్. నితిన్ కంటే ముందు హీరో రాజశేఖర్ తెలుగు ఇండస్ట్రీలో నిరుపేద కళాకారులకు నిత్యావసరాలు ఇస్తానని ప్రకటించారు. దర్శకుడు వీవీ వినాయక్ సినీ కార్మికుల కోసం రూ. ఐదు లక్షలు ఇచ్చారు. తమిళ హీరోల్లో రజనీకాంత్ రూ. 50 లక్షలు, విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు, సూర్య-కార్తీ ఫ్యామిలీ రూ. 10 లక్షలు, శివ కార్తికేయన్ రూ. 10 లక్షలు ఇచ్చారు. కరోనా వైరస్ చికిత్స కేంద్రాల కోసం తమ ఇళ్లను ఇస్తామని కమల్ హాసన్, పార్తీబన్ ప్రకటించారు. ఇండస్ట్రీ నుండి మరికొందరు కరోనాపై పోరాటానికి సహాయ సహకారాలు అందించడానికి ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది.