పవన్ ఇప్పుడు 'ఆంధ్రావాలా'
on Nov 1, 2016
హీరోగా పవన్ కల్యాణ్ తెలుగు వాళ్లందరికీ పవర్ స్టారే! అటు ఆంధ్ర లోనూ, ఇటు తెలంగాణలోనూ పవన్కి లెక్కనేనంతమంది అభిమానులున్నారు. ఆ మాటకొస్తే... నైజాంలో పవన్ స్టామినాకు తిరుగులేదు. అలాంటిది జనసేన అధ్యక్షుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఇప్పుడు పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ కే పరిమితం అవ్వాలని నిర్ణయించుకొన్నారు. అవును.. పవన్ కేవలం ఆంధ్రావాలానే. ఆ మాటే నిజం చేస్తూ... తన ఓటును ఏలూరులో నమోదు చేయించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంతేకాదు... నివాసాన్ని అక్కడకు మార్చేయాలని డిసైడ్ అయ్యారు. సోమవారం హైదరాబాద్లో పవన్ని అతని అభిమానులు, జనసేన కార్యకర్తలు కొందరు కలుసుకోవడం, ఏలూరుకి ఓటు హక్కు మార్చుకోండని కోరడం, దానికి పవన్ అంగీకరించడం జరిగిపోయాయి. ఏలూరులో తనకో నివాసాన్ని చూడమని అక్కడి జనసేన ప్రతినిధుల్ని పవన్ కోరాడు కూడా. పవన్ ఓటు ఇప్పటి వరకూ హైదరాబాద్ లోనే ఉంది. పవన్ జనసేన ని ప్రారంభించినప్పటి నుంచీ పూర్తిగా ఆంధ్రా రాజకీయాలపైనే దృష్టి పెడుతున్నాడు. తెలంగాణలో జనసేన పార్టీకి ఉనికి కష్టంగానే ఉంది. దానికి తోడు పవన్ కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వ్యక్తి. కాబట్టి.. పవన్ ఆంధ్రాకి తరలివెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడేమో.