‘పోకిరి’కి అలా.. ‘సర్కారు వారి పాట’కి ఇలా...
on Jun 1, 2020
ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’తో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ని సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్. స్వల్ప విరామం అనంతరం తన తదుపరి చిత్రంగా 'సర్కారు వారి పాట'ని ప్రకటించాడు. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. సహజంగానే 'సర్కారు వారి పాట’పై మంచి అంచనాలే నెలకొన్నాయి. దానికి తోడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రి లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళనుంది. కాగా దాదాపు ఏడేళ్ళ విరామం అనంతరం ఈ సినిమా కోసమే మహేశ్ బాబుతో మరోసారి జట్టుకడుతున్నాడు యువ సంగీత సంచలనం తమన్. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ‘పోకిరి’కి.. ఈ ‘సర్కారు వారి పాట’కి గురు శిష్యుల కనెక్షన్ ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. 'పోకిరి'కి 'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తే.. ‘సర్కారు వారు పాట’ని ఆయన శిష్యుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ‘పోకిరి’కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తే.. ‘సర్కారు వారి పాట’కి మణి శిష్యుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సో.. ‘పోకిరి’కి గురువుల కాంబినేషన్ (పూరీ జగన్నాథ్, మణిశర్మ) ఎలాగైతే మహేశ్ బాబుకి వర్కవుట్ అయిందో.. అలాగే 'సర్కారు వారి పాట’కి శిష్యుల కాంబినేషన్ (పరశురామ్, తమన్) కూడా కలిసొస్తుందేమో చూడాలి.