ధనుష్ దెబ్బకి ప్రభాస్ అవుట్...!
on Sep 26, 2016
బాహుబలి..తెలుగు సినిమాతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకే గర్వకారణం. భారత్ పాటు ఎక్కడ ఏ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినా అవార్డులు, రివార్డులన్ని బాహుబలివే. ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి ఆస్కార్కు కనుక వెళితే తప్పకుండా అవార్డు కన్ఫార్మ్ అనుకున్నారంతా కాని అవన్నీ భ్రమలే అని తేలిపోయింది. ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం విభాగం కోసం ప్రతీసారి మన దేశం నుంచి ఓ సినిమా వెళ్తుంటుంది. ఈ సారి ఈ విభాగంలో మన తెలుగు నుంచి "రుద్రమదేవి", "కంచె" సినిమాలు పోటీపడ్డాయి. "బాహుబలి"కి అయితే కనీసం ఆ అవకాశం కూడా దక్కలేదు.
బాహుబలి, రుద్రమదేవి, కంచె సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కినవి..కానీ, వాటిని వెనక్కినెట్టి కేవలం కోటిన్నర రూపాయలతో తీసిన విసారణై ఆస్కార్ ఎంట్రీ సాధించింది. తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ విసారణైని నిర్మించారు. దీనికి ధనుష్ స్నేహితుడు వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. పోలీసులు, నలుగురు కూలీల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్హిట్ టాక్ను తెచ్చుకుంది. ఈ సినిమాకు ఇప్పటికే మూడు జాతీయ అవార్డులు రావడమే కాకుండా..అంతర్జాతీయ స్థాయిలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.