మహేశ్ కి మరోసారి కలిసొచ్చేనా!
on Dec 3, 2021
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు`తో హ్యాట్రిక్ కొట్టిన సూపర్ స్టార్ మహేశ్ బాబు.. త్వరలో `సర్కారు వారి పాట`తో సందడి చేయనున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 1కి ఈ సినిమా వాయిదా పడింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఏప్రిల్ నెలలో విడుదలైన మహేశ్ సినిమాల్లో సింహభాగం విజయం సాధించాయి. `యువరాజు`(2000), `పోకిరి`(2006), `భరత్ అనే నేను` (2018).. ఇలా ఇప్పటివరకు ఏప్రిల్ నెలలో వేర్వేరు సంవత్సరాల్లో ముచ్చటగా మూడు సార్లు సందడి చేశారు మహేశ్. వీటిలో `యువరాజు` యావరేజ్ గా నిలవగా.. `పోకిరి` ఇండస్ట్రీ హిట్ గా రికార్డులకెక్కింది. ఇక `భరత్ అనే నేను` కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో.. అపజయాలు ఎరుగని మాసంగా నిలిచిన ఏప్రిల్ నెలలో `సర్కారు వారి పాట`తో మహేశ్ మరోసారి పలకరించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. ఏప్రిల్ నెల మహేశ్ కి మరోసారి కలిసొస్తుందేమో చూడాలి.
కాగా, `సర్కారు వారి పాట`లో మహేశ్ బాబు జోడీగా కీర్తి సురేశ్ కనిపించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.