మరోసారి మూతపడే దిశగా థియేటర్లు?
on Apr 10, 2021
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సినిమా హాళ్లు మూతపడనున్నాయా?.. ఇప్పుడు టాలీవుడ్తో పాటు సినీ గోయర్స్ను కలవరపెడుతోన్న సందేహం ఇది. కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్డౌన్తో 2020 మార్చిలో మూతపడిన థియేటర్లు నాలుగు నెలల క్రితం నుంచి క్రమంగా తెరుచుకుంటూ వచ్చాయి. మొదట 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేయడానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఆ తర్వాత 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చేశాయి. దీంతో దేశం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా హాళ్లు జనంతో కిటకిటలాడుతూ కళకళలాడుతూ వస్తున్నాయి.
క్రాక్, రెడ్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, జాంబీరెడ్డి, ఉప్పెన, నాంది, ఎ1 ఎక్స్ప్రెస్, జాతిరత్నాలు లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ముఖ్యంగా 'క్రాక్', 'ఉప్పెన', 'జాతిరత్నాలు' సినిమాలు బ్లాక్బస్టర్స్గా నమోదయ్యాయి. వాటికి వచ్చిన కలెక్షన్లు ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచాయి. లేటెస్ట్గా పవన్ కల్యాణ్ మూవీ 'వకీల్ సాబ్' ఆడియెన్స్ను అలరిస్తోంది. తెలుగునాట సినిమాలు ఇలా ఆడుతుండటం చూసి, మిగతా దేశమంతా విస్తుపోతూ చూస్తోంది. తెలుగు సినిమాల తర్వాత తమిళ, కన్నడ సినిమాలు కూడా థియేటర్లలో బాగానే ఆడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్తో నార్త్లో థియేటర్లకు రావడానికే జనం భయపడుతున్నారు. అందుకే అక్కడ బిగ్ టిక్కెట్ సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ధైర్యం చెయ్యడం లేదు. రిలీజైన మీడియం, స్మాల్ బడ్జెట్ సినిమాలను చూసేవాళ్లే లేరు.
ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ భయం ఇప్పుడు సౌత్ను, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను భయపెడుతోంది. కేసుల సంఖ్య బాగా పెరుగుతుండటంతో లాక్డౌన్ భయం వెన్నాడుతోంది. అయితే గత ఏడాది తరహాలో లాక్డౌన్ విధించే అవకాశం లేదనీ, కొన్ని నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తామనీ ప్రభుత్వాలు అంటున్నాయి. ఇప్పటికే స్కూళ్లను మళ్లీ మూసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ కారణంగా సినిమా హాళ్లు కొవిడ్-19 వ్యాప్తికి దోహదం చేస్తాయనీ, అందువల్ల వాటిని మూసేయడం కానీ, లేదా కనీసం 50 శాతం ఆక్యుపెన్సీతో నడపడం కానీ చేయాలనీ వాదిస్తున్నారు. అయితే అలా చేస్తే వాటిమీద ఆధారపడినవారి జీవితాలు ఆగమాగం అవుతాయని ఇండస్ట్రీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది తొమ్మది నెలలకు పైగా థియేటర్లు మూతపడటం వల్ల వాటి మీద ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరోసారి అలాంటి స్థితిని భరించే శక్తి వారికి లేదని వారంటున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తంగా థియేటర్లను మూసేసే బదులు 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేసేందుకు ప్రభుత్వాలు ఆమోదించవచ్చు. అయితే దాని వల్ల సినిమాలు నష్టపోతాయనీ, మొదట అలా 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ చేసినప్పుడు నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు రాకపోగా, నష్టాలే మిగిలాయనీ వారంటున్నారు.
నిజానికి ఈసరికే థియేటర్లను మూసేయడమో, 50 శాతం ఆక్యుపెన్సీతో నడపడమో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసేదనీ, 'వకీల్ సాబ్' మూవీ గురించే దాన్ని వాయిదా వేశారనీ ప్రచారంలోకి వచ్చింది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరి' మూవీ రిలీజ్ డేట్ను వాయిదా వేయడం కూడా ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. వాస్తవానికి ఏప్రిల్ 16న ఆ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. కానీ ఇటీవలే ప్రెస్మీట్ పెట్టి కొవిడ్ కేసులు అంతకంతకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం వల్ల ప్రేక్షకుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విడుదలను వాయిదా వేస్తున్నామని వారు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.
ఆ సినిమాని నిర్మించింది తెలంగాణలో అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన, థియేటర్ల చైన్లలో ఒకటైన ఏషియన్ ఫిలిమ్స్ నారాయణదాస్ నారంగ్. తెలంగాణ ప్రభుత్వంలోని పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. థియేటర్ల మూసివేతో, 50 శాతం ఆక్యుపెన్సీ రేట్తో థియేటర్లు నడుపుకోవడమో అమల్లోకి రావచ్చనే సమాచారం ఉన్నందువల్లే లవ్ స్టోరి రిలీజ్ డేట్ను పోస్ట్పోన్ చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.
Also Read