ఈ ఫొటో ప్రత్యేకత ఏంటి? చెప్పుకోండి?
on Oct 30, 2017
మన ఇళ్లలో మన పెద్దలు దిగిన ఫొటోలు గుర్తొస్తున్నాయ్ కదా! ఈ ఫొటో చూస్తే.. నాకు తెలీకడుగుతానూ... ముగ్గురూ ఫ్రెండ్సే కదా. మరి ఒకాయన్ను కూర్చోబెట్టి.. ఇద్దరూ అటూ ఇటూ ఎందుకు నిలబడ్డారు? దాందేముందిలే.. మొత్తం మూడు ఫొటోలు దిగుంటారు. ఒక్కోసారి ఒక్కొక్కళ్లు కూర్చొని ఉంటారు! అయితే మిగిలిన రెండు ఫొటోలు ఎక్కడ? ఈ ఫొటోనే ఎందుకు బయటకొచ్చింది? ఈ ఫొటో స్పెషాలిటీ ఏంటి? అసలు ఆ నాటి ఈ కుర్రాళ్లు ఎవరు?
అయ్యబాబోయ్ ఇన్నిప్రశ్నలా? అవును మరి.. ఒక్కసారి స్వతంత్ర్యానికి పూర్వం ఫొటోను పెట్టేసి న్యూస్ రాస్తే.. ఇలాంటి ప్రశ్నలే వస్తాయ్. ఈ ప్రశ్నలన్నింటికీ మీకు సమాధానాలు కావాలంటే.. ఒక్కసారి ఆ ఫొటో వంక పరీక్షగా చూడండి.. వాళ్లెవరో తెలిసిపోతుంది.
ఒక్కక్కరూ పొజిషన్లు మార్చుకొని మూడు ఫొటోలు దిగినా.. ఈ ఒక్క ఫొటోనే ఎందుకు బయటకొచ్చిందో తెలసిపోతుంది. ఈ ఫొటో ప్రత్యేకత ఏంటో అర్థమైపోతుంది. చూశారా? అర్థమైందా? ఆ... అర్థం కాక ఏముంది? ఆ మధ్యలో కూర్చున్నాయన మామూలు మనిషా!.. తెలుగోడి ఆస్థి. తెలుగోడి ఆత్మగౌరవం.. తెలుగులోడి ఆత్మాభిమానం.. తెలుగుతనానికి నిండైన రూపం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ.. నటరత్న.. పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు. వెండితెర వేల్పుగా... మహానేతగా తెలుగువారి గుండెల్లో స్థిరమైనస్థానం ఏర్పరచుకున్న మహానుభావుడు.
గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తరుణంలో... తన క్లాస్ మేట్స్ తో కలిసి అన్నగారు తీయించుకున్న ఫొటో ఇది. ఇది 1945 నాటి ముచ్చట. ఎడమవైపు నిలుచున్న వ్యక్తి పేరు గుమ్మడి మల్లికార్జునరావు, కుడివైపు నిలుచున్న వ్యక్తి పేరు నాగేశ్వరరావు.