సావిత్రికి నో చెప్పి... జయలలితకు ఎస్..!
on Sep 22, 2018
బయోపిక్.. బయోపిక్.. బయోపిక్! తెలుగు, తమిళ్, హిందీ... భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది! తెలుగులో నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా 'యన్.టి.ఆర్', వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' తెరకెక్కుతున్నాయి. తమిళంలోనూ బయోపిక్ సీజన్ మొదలవుతోంది. తమిళ బయోపిక్స్లో క్రేజీ బయోపిక్స్ అంటే జయలలిత సినిమాలే. ఆమె జీవితంపై సినిమా తీయడానికి నలుగురు ఐదుగురు సిద్ధంగా వున్నారు. కొంత మంది తీస్తున్నట్టు ప్రకటించారు. అందులో దర్శకురాలు జేజే ప్రియదర్శిని ఒకరు. ఆమె తీయబోయే బయోపిక్లో జయలలిత పాత్రలో నిత్యా మీనన్ నటించనున్నారు. ఇటీవల నిత్యా మీనన్, జేజే ప్రియదర్శిని మధ్య చర్చలు జరిగాయి. జయలలిత పాత్రలో నటించడానికి నిత్య అంగీకరించారు.
నిత్యా మీనన్ నటించనున్న మొట్టమొదటి బయోపిక్ ఇదే కానుంది. ఇంతకు ముందు 'మహానటి'లో సావిత్రిగా నటించమని ఆమెను సంప్రతిస్తే నో చెప్పారు. ఎందుకు? అనేది మాత్రం చెప్పలేదు. సావిత్రిగా నటించమని అడిగారు కానీ... కుదరలేదని మాత్రమే చెప్పారు. సావిత్రికి 'నో' చెప్పిన నిత్యా మీనన్, జయలలితకు 'ఎస్' చెప్పడం విశేషమే. జయలలిత జీవితంలో సినిమాలు, రాజకీయాలు.. రెండిటికి సమ ప్రాధాన్యత వుంది. నిత్యాను జయలలిత జీవితంలో ఏయే అంశాలు ఆకర్షించాయో?