నితిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి!
on Feb 15, 2020
హీరో నితిన్ త్వరలో వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. ఐదేళ్లుగా తను ప్రేమిస్తోన్న శాలిని అనే యువతిని పెళ్లి చేసుకొనేదుకు సిద్ధమవుతున్నాడు. దుబాయ్లో ఏప్రిల్ 16న డెస్టినేషన్ వెడ్డింగ్లో శాలిని మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నితిన్. కాగా శనివారం హైదరాబాద్లోని నితిన్ ఇంట్లో 'పసుపు కుంకుమ' వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన్ నితిన్ "పెళ్లిపనులు మొదలయ్యాయి. మ్యూజిక్ మొదలయ్యింది. మీ ఆశీర్వాదం కావాలి" అని పోస్ట్ చేశాడు. ఈ ఫొటోల్లో లైట్ పింక్ కలర్ షేర్వాణీ ధరించిన నితిన్, గ్రీన్-ఎల్లో కాంబినేషన్ డిజైనర్ శారీలో శాలిని మెరిసిపోతున్నారు. ఇద్దరి మెడల్లోనూ దండలున్నాయి. సంప్రదాయబద్ధంగా పురోహితుడు చెప్తున్న వాటిని ఆ ఇద్దరూ పాటిస్తూ కనిపిస్తున్నారు.
ఐదేళ్ల క్రితం నితిన్, శాలిని ప్రేమలో పడ్డారని సమాచారం. సినిమా స్టైల్లోనే ఆమెకు నితిన్ ప్రపోజ్ చేశాడంట. ఏప్రిల్ 16న పెళ్లాడటానికి ఆ జంట సిద్ధమవుతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నితిన్ మాట్లాడుతూ, "దుబాయ్లో మా పెళ్లి జరుగుతుంది. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'రంగ్ దే' షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల పెళ్లి థీమ్ ను ఇంకా డిసైడ్ చెయ్యలేదు. అయితే అది స్పెషల్గా ఉంటుందని చెప్పగలను. పెళ్లయ్యాక, హైదరాబాద్లో నా ఫ్రెండ్స్ అందరితో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి రిసెప్షన్ ఉంటుంది" అని చెప్పాడు.
దాన్ని బట్టి నితిన్, శాలిని పెళ్లి కొద్దిమంది సన్నిహిత మిత్రులు, బంధువుల సమక్షంలో జరుగుతుందని అర్థమవుతోంది. తన లైఫ్లో గొప్ప రోజు శాలినికి ప్రపోజ్ చేసిన రోజేననీ, అప్పుడు శాలిని ఓకే చేసిందనీ అతను అంటున్నాడు. ప్రేమలో పడ్డ నాలుగేళ్ల తర్వాత వాళ్లు తమ తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారు. మొదట ఆశ్చర్యపోయిన వాళ్లు, ఆ తర్వాత తమ అంగీకారం తెలిపారు. ఈ మార్చి 30వ తేదీకి నితిన్కు 37 ఏళ్లు నిండుతున్నాయి.
Also Read