నిశ్శబ్దం... ఏంటీ గందరగోళం?
on May 27, 2020
అనుష్క ప్రధానపాత్రలో నటించిన 'నిశ్శబ్దం' సెన్సార్ పూర్తయింది. తెలుగు సహా తమిళ సెన్సారునూ పూర్తి చేశారు. తమిళంలో ఈ సినిమా 'సైలెన్స్'గా విడుదల కానుంది. సినిమాకి యు/ఏ సిర్టిఫికెట్ లభించింది. చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ సంగతి ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్ చివర్లో ఆయన చెప్పిన ఒక్క మాట సినిమాపై కొత్త సందేహాలకు తావు ఇస్తోంది.
"సెన్సార్ బోర్డు సభ్యుల నుండి అద్భుత స్పందన లభించింది. సినిమాను మొదట థియేటర్లలో విడుదల చేయమని వాళ్ళు ఇచ్చిన సలహాకు సిన్సియర్ థాంక్స్" అని హేమంత్ మధుకర్ అన్నారు. ఇటీవల కోన వెంకట్ సైతం సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని ట్వీట్ చేశారు. రెండు రోజుల తర్వాత థియేటర్లలో విడుదల చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, పరిస్థితులు అనుకూలించకపోతే ఓటీటీలో విడుదల చేస్తామని కోన వెంకట్ పేర్కొన్నారు. దర్శకుడు హేమంత్, కోన వెంకట్ మాటల్లో గందరగోళం స్పష్టంగా కనబడుతోంది. అంతకు మించి థియేటర్లలో విడుదల అయితే బావుంటుందనే కోరిక ఉంది. అయితే, సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డిసైడ్ అయిందట.